మాయదారి కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచీ చిత్ర విచిత్రాలన్నీ చోటు చేసుకుంటున్నాయి. ఇక తాజాగా ఒక విచిత్రమైన పెళ్లి తంతు బయటకు వచ్చింది. కర్నూలు జిల్లాల్లో ఇటీవల అంగరంగ వైభవంగా ఓ వివాహం జరిగింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, పెళ్లి జరిపించే పురోహితుడు, బాజాభజంత్రీలు మోగించేందుకు మేళగాళ్లు ఇలా అందరూ ఉన్నారు. కానీ, వధూవరులు మాత్రం లేరు.
అయినప్పటికీ.. వివాహం మాత్రం గ్రాండ్గా జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లాకు చెందిన మధుసూదన్ రెడ్డి శైలజారెడ్డి దంపతుల కుమార్తె రజితకు.. నల్గొండకు చెందిన వెంకట్రామిరెడ్డి, కవిత దంపతుల కుమారుడు దినేష్ రెడ్డితో వివాహం జరిపించాలని నిశ్చయించారు. ముహూర్తాలు పెట్టుకుని, బంధుమిత్రులను ఆహ్వానించి, అంగరంగ వైభవంగా తమ బిడ్డలకు పెళ్లి చేయాలనుకున్నారు.
రజిత, దినేష్ ఇద్దరూ ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తుండగా.. పెళ్లి చేసుకునేందుకు ఇండియా వద్దమని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఇంతలోనే కరోనా వైరస్ దాపరించడంతో.. వారు అక్కడి నుంచి రాలేకపోయారు. ఇటు ఇండియా వీరి తల్లిదండ్రులు అక్కడికి వెళ్లలేకపోయారు. దాంతో రజిత, దినేష్ ల వివాహం గత ఏడది నుంచి వాయిదా పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే చేసేదేం లేక.. ఆన్లైన్లో పెళ్లి తంతు జరిపించారు. వధూవరులిద్దరూ ఆస్ట్రేలియా నుంచి పెళ్లి చేసుకోగా.. వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో అన్లైన్ ద్వారా వివాహ తంతును జరిపించారు.