మల్లన్నను రామన్న సమర్థిస్తున్నట్లుందే..!

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి వాడిన పదజాలాన్ని మం‍త్రి, టీ కేటీఆర్‌ సమర్థిస్తున్నారా అని ప్రశ్నిస్తే అవుననే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. మంత్రి కేటీఆర్‌ గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మల్లారెడ్డిని నేరుగా సమర్థించకుండా దాదాపు సమర్థిస్తున్నట్లే మాట్లాడారు. రెండు రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్‌ రెడ్డిని పరుష పదజాలంతో దూషించారు. దీంతో కాం‍గ్రెస్‌ పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల మల్లారెడ్డి దిష్టిబొమ్మన దహనం చేశారు. రేవంత్‌కు మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు ఒక్కటైనట్లు కనిపిస్తోంది.

ఈ నేపథ్యంలో శుక్రవారం కేటీఆర్‌ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మల్లారెడ్డి, రేవంత్‌ రెడ్డిల దూషణ పర్వాన్ని మీడియా ప్రతినిధులు కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. మల్లారెడ్డి వ్యవహారాన్ని డైరెక్టుగా సమర్థించకుండా చాకచక్యంగా సమాధానం చెప్పారు. వారి గొడవకు న్యూటన్‌ నియమంతో పోల్చారు. For every action there is an equal and opposite reaction అంటూ తెలివిగా ఆన్సర్‌ చెప్పారు. దీంతో మీడియా ప్రతినిధులు సైతం ఆశ్చర్యపోయారు. ఓహో.. మల్లారెడ్డికి సపోర్టు చేస్తున్నట్లే ఉందని విలేకరులు భావించారు. అంతేకాక కేటీఆర్‌ మరో అడుగు ముందుకేసి.. ఈ విషయం మీరు రేవంత్‌ రెడ్డిని ఎందుకు ప్రశ్నించరు అని ఎదురు ప్రశ్న వేశారు. రేవంత్‌ రెడ్డి రోజూ కేసీఆర్‌, కేటీఆర్‌, పార్టీని దూషిస్తున్నారని ఆరోపించారు. ఏడు సంవత్సరాల పాటు సహనం వహించిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఇక ఓపిక నసించిందని, వారికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇస్తారని చెప్పారు. డర్టీ పాలిటిక్స్మ మొదలు పెట్టిందే కాం‍గ్రెస్‌ వాళ్లని, వారిది తిరిగి వెనక్కు ఇచ్చేస్తున్నామని చెప్పడం చూస్తుంటే.. టీఆర్‌ఎస్‌ కూడా ఇక వెనక్కి తిరిగి చూడదు అని చెప్పినట్లుంది.