దర్శకుడు పరశురామ్ గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. యువత సినిమాతో డైరెక్టర్గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన పరశురామ్.. సోలో, శ్రీరస్తు శుభమస్తు, గీత గోవిందం వంటి చిత్రాలతో మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమాలో షూటింగ్ గోవాలో జరుగుతోంది. అయితే నిజానికి మహేష్ కంటే ముందే నాగ చైతన్యతో సినిమా చేయాల్సి ఉంది. కానీ మహేష్ ఆఫర్ రావడంతో పరశురామ్ ఆయనతో సినిమాను మొదలుపెట్టాడు. సర్కారు వారి పాట పూర్తి అయిన వెంటనే పరుశురామ్.. చైతన్యతో సినిమా చేయనున్నాడు. అయితే పరుశురామ్తో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఓ సినిమా చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నాడట.
గీత గోవిందం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసిన దగ్గర నుంచి గీతా ఆర్ట్స్తో పరశురామ్కి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యంతోనే బన్నీ, పరుశురామ్ కాంబోలో ఒక సినిమాను చేసే దిశగా పనులను జరుగుతున్నాయని.. త్వరలోనే దీనిపై అన్ని వివరాలు బయటకు రానున్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, బన్నీ ప్రస్తుతం క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో `పుష్ప` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. షూటింగ్ దశలో ఉన్న పుష్ప మొదటి భాగం క్రిస్టమస్ కానుకగా విడుదల కానుంది.