పాన్ ఇండియా చిత్రాలకు వందల, వేల మందిని ఆడిషన్ చేయడం సర్వ సాధారణం. కానీ, ఓ మామూలు చిత్రానికి ఏకంగా 700 మందిని ఆడిషన్ చేశాడు ఓ తెలుగు డైరెక్టర్. ఇంతకీ ఆయన ఎవరో కాదు..సంపత్ నంది. ఈయన దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం `సీటీమార్`. ఈ చిత్రంలో తమన్నా హీరోయిన్గా నటించింది.
కబడ్డీ నేపథ్యంలోనే రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపీచంద్ ఆంధ్రప్రదేశ్ కబడ్డీ కోచ్గా, తమన్నా తెలంగాణ కబడ్డీ కోచ్గా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సంపత్ నంది.. సీటీమార్లో కబడ్డీ ప్లేయర్లుగా కనిపించే 24 మందిని సెలెక్ట్ చేసుకోవడానికి చాలా కష్టపడ్డానని తెలిపారు. మొత్తం 700 మందిని ఆడిషన్ చేసి.. అందులోంచి 24 మందిని ఎంపిక చేశానని.. ఆ తర్వాత వారికి కొన్ని నెలల పాటు శిక్షణ ఇచ్చాక అప్పుడు సినిమా మొదలుపెట్టామని సంపత్ నంది చెప్పుకొచ్చాడు. అలాగే తనకు కబడ్డీ అంటే చాలా ఇష్టమని..ఐతే ప్రొ కబడ్డీ లీగ్ చూస్తున్నపుడు తనకు కబడ్డీ నేపథ్యంలో సినిమా తీయాలన్న ఆలోచన పుట్టిందని.. ఆ తర్వాత ‘సీటీమార్’ కథ రాశానని సంపత్ వెల్లడించాడు.