వైఎస్ఆర్ జయంతి..మోహన్‌బాబు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు!

దివంగ‌త ముఖ్య‌మంత్రి, తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న మ‌హానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి జ‌యంతి నేడు. ఈ నేప‌థ్యంలోనే అన్ని జిల్లాల్లోనూ వైఎస్ఆర్ జయంతి వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నారు. మ‌రోవైపు ఇడుపులపాయలోని ఆయ‌న సమాధి వద్ద కుటుంబసభ్యులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. వైఎస్ఆర్ జయంతి సంద‌ర్భంగా విల‌క్ష‌న న‌టుడు, టాలీవుడ్ క‌ల‌క్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబు సోష‌ల్ మీడియా ద్వారా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `స్నేహశీలీ, రాజఠీవి, రాజకీయ దురంధరుడు, మాట తప్పడు మడమ తిప్పడు అన్న మాటకు నిలువెత్తు నిదర్శనం,పేద ప్రజల దైవం మా బావగారైన వై.ఎస్. రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు నేడు.

మా బావగారు ఏ లోకంలో ఉన్నా ఆయనకు ఆత్మశాంతి కలగాలని ఆయన దీవెనలు మా కుటుంబానికి, తెలుగు ప్రజలకి ఉండాలని కోరుకుంటున్నాను` అంటూ మోహ‌న్ బాబు నివాళులర్పించారు. ఇక ద‌ర్శ‌కుడు గోపీచంద్ మలినేని, నిర్మాత కోణ వెంక‌ట్, బండ్ల గ‌ణేష్‌ త‌దిత‌రులు కూడా వైఎస్ఆర్‌కు సోష‌ల్ మీడియా ద్వారా నివాళులర్పించారు.