ఏపీలో కొత్త‌గా 2,974 క‌రోనా కేసులు.. ఆ జిల్లాలోనే అత్య‌ధికం!

కంటికి క‌నిపించ‌ని శ‌త్రువుగా మారిన క‌రోనా వైర‌స్‌..చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అంద‌రినీ ముప్ప తిప్ప‌లు పెడుతోంది. ఇప్ప‌టికే ఈ ప్రాణాంత‌క వైర‌స్ కార‌ణంగా కొన్ని ల‌క్ష‌ల మంది ప్రాణాలు విడ‌వ‌గా.. మ‌రెంద‌రో వైర‌స్‌తో పోరాడుతున్నారు.ఇదిలా ఉంటే.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో గ‌త కొద్ది రోజులుగా క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు త‌గ్గుతున్న సంగ‌తి తెలిసిందే.

అయితే నిన్న క‌రోనా కేసులు పెర‌గ‌గా.. మ‌ర‌ణాలు మాత్రం త‌గ్గాయి. ఏపీ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,974 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలోనే అత్య‌ధికంగా 577 క‌రోనా కేసులు న‌మోదు కాగా.. అతి స్వ‌ల్పంగా విజయనగరం జిల్లాలో 33 కేసులు వ‌చ్చాయి. దీంతో రాష్ట్రంలో క‌రోనా పాజిటివ్ కేసులు 19,30,096 కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 17 మంది మృత్యువాత ప‌డ్డారు.

ప్ర‌స్తుతం రాష్ట్రంలో మృతుల సంఖ్య 13,132 ద‌గ్గ‌ర నిలిచింది. అలాగే నిన్నొక్క రోజే 3,290 మంది క‌రోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ఇప్ప‌టివ‌ర‌కు రాష్ట్రంలో మొత్తం రికవరీల సంఖ్య 19,02,256 కి చేరుకుంది. ప్ర‌స్తుతం ఏపీలో 24,708 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక నిన్నొక్క రోజే 1,05,024 కరోనా పరీక్షలు నిర్వ‌హించారు.