లోకేష్ పై సంచలన కామెంట్స్ చేసిన రోజా..?

కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ పోరాడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యంగ్యం ప్రదర్శించారు. తిన్నది అరగక చంద్రబాబు, లోకేశ్ విమర్శలు చేస్తున్నారని, ఏం మాట్లాడడానికి విషయాలు లేక, ఇలాంటి అంశాలను లేవనెత్తుతున్నారని మండిపడ్డారు. వీళ్లకు అసలు రాష్ట్రంపై ఏమైనా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు.

లోకేశ్ తనలాగే రాష్ట్రంలోని విద్యార్థులు కూడా చదువులో మొద్దుల్లాగా వెనుకబడిపోవాలని కోరుకుంటున్నట్టుంది అని విమర్శించారు. ఆయన పోరాటం చూస్తే అందుకేనేమో అనిపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో పరీక్షలు జరుపుతామనో, జరపబోమనో సీఎం జగన్ ఇప్పటికీ కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని, లోకేశ్ ఈ విషయం గుర్తించాలని రోజా హితవు పలికారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా పాజిటివిటీ రేటు ఆరు శాతానికి వచ్చిందని, పూర్తిగా తగ్గిపోయిన తర్వాత పరీక్షలు జరిపితే వారికి నాణ్యమైన విద్యను అందించిన వారమవుతామని రోజా పేర్కొన్నారు.