మరో సారి క్రేజీ కాంబో..?

బాలీవుడ్‌ స్టార్ దర్శకుల్లో సంజలీలా భన్సాలీ ఒకరు. హీరోల్లో షారుఖ్ ఖాన్ కూడా అదే రీతిలో అద్భుత విజయాలను అందుకున్నాడు. వీరిద్దరి కాంబోలో 2002లో దేవదాసు అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ఇద్దరికీ మంచి బ్రేక్ ను ఇచ్చింది. అందులో షారుఖ్ సరసన మాధురీ దీక్షిత్, ఐశ్వర్యా రాయ్ హీరోయిన్‌లుగా నటించారు. ఈ సినిమా అప్పట్లో బ్రిటీష్ అకాడమి ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజన్ అవార్డ్స్‌కు ఎన్నికైంది.

అయితే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో మరో సినిమా రాలేదు. కానీ వీరి కాంబోలో సినిమా వస్తే చూడాలని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం 19 సంవత్సరాల తరువాత వీరి కాంబోలో మరో సినిమా రానుంది. ఈ సినిమా ఓ ప్రేమకథ అని టాక్ ఉంది. ‘ఇజార్’ సినిమా కోసం వీరిద్దరు మళ్లీ కలవబోతున్నారని, వీరిద్దరి మధ్య ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటి వరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. త్వరలో క్లారిటీ రానుంది.