దేశంలో మళ్లీ ఎక్కడ చూసినా కరోనా మహమ్మారి పేరే వినిపిస్తోంది. మునుపటితో పోలిస్తే సెకెండ్ వేవ్లో మరింత వేగంగా, తీవ్రంగా మారిన కరోనా దెబ్బకు ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా పశ్చిమ రాజస్థాన్లోని బార్మెర్ జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది.
కరోనా మహమ్మారి కారణంగా కన్న తండ్రి మరణించాడన్న మనస్తాపంతో ఆయన చితిలోనే దూకి ఆత్మహత్యాయత్నం చేసింది కూతురు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బార్మెర్ జిల్లా కేంద్రంలోని రాయ్ కాలనీలో నివసిస్తున్న దామోదర్ దాస్ కరోనా కారణంగా మృతి చెందాడు. దీంతో అతని అంత్యక్రియలకు శ్మశానవాటికలో ఏర్పాట్లు చేశారు. పంచాయతీ సిబ్బంది, కుమార్తెలు, ఇతర బంధువుల సమక్షంలో చితి అంటించారు.
ఆ వెంటనే దామోదర్ దాస్ కుమార్తె శారద చితిపైకి దూకేసింది. అది చూసిన అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఆమెను చితి నుంచి బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నించారు. కానీ, అప్పటికే శారద శరీరం 70 శాతానికిపైగా కాలిపోయింది. ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.