స్మ‌శానానికి స్వాగ‌తం.. బీజేపీ శ‌వ‌రాజ‌కీయాలు..!

రాజ‌కీయ నాయ‌కులు వ్య‌క్తిగ‌త ప్ర‌చారానికి ఇచ్చే ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు. ప్ర‌తి విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా ప్ర‌చారం చేసుకోవాల‌ని చూస్తుంటారు. త‌మ ఇమేజ్‌ను పెంచుకోవాల‌ని ఆరాట‌ప‌డుతుంటారు. పోస్ట‌ర్ల‌ను వేసుకుంటూ హోరెత్తిస్తుంటారు. అయితే క‌ర్నాట‌క‌కు చెందిన బీజేపీ నేత‌లు ఆఖ‌రికి కొవిడ్ మ‌ర‌ణాల‌ను కూడా త‌మ ప్ర‌చారానికి వినియోగించుకోవ‌డంపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. స్మ‌శానానికి స్వాగ‌తం అంటూ క‌ట్టిన ఫ్లెక్సీల‌పై నెటిజ‌న్లు భ‌గ్గుమంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. కోవిడ్‌ మృతుల అంత్యక్రియల కోసం క‌ర్నాట‌క రాష్ట్రం నెలమంగల తాలూకా గిడ్డేనహళ్లి వద్ద లో అధికారులు ఉచితంగా ఏర్పాట్లు చేశారు. అక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా కొంద‌రు బీజేపీ నేత‌లు త‌మ పబ్లిసిటీ పిచ్చితో అక్క‌డ ఫ్లెక్సీల‌ను ఏర్పాటు చేశారు.

శ్మశానానికి దారి…అంత్యక్రియలకు వచ్చేవారికి ఉచితంగా నీరు, కాఫీ, భోజనం ఏర్పాటు చేశామంటూ ప్రధాని నరేంద్రమోదీ, సీఎం యడియూరప్ప, రెవెన్యూ మంత్రి ఆర్‌ అశోక్, బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ తదితరుల ఫొటోలతో ఫ్లెక్సీ తయారు చేయించి ప్రచారం చేసుకోవ‌డం శోచ‌నీయం. విషయం కాస్త పార్టీ పెద్దలకు తెలియడంతో స‌ద‌రు నేత‌ల‌కు క్లాస్‌ తీసుకున్నారు. దీంతో వారు ఆ ఫ్లెక్స్‌ తీయించేశారు. బీడీఏ అధ్యక్షుడు ఎస్‌ఆర్‌ విశ్వనాథ్‌ క్షమాపణలు కూడా చెప్పుకొచ్చారు. అయితే అప్పటికే జ‌ర‌గాల్సిందంతా జ‌రిగిపోయింది. ఫ్లెక్సీ నెట్టింట్లో చక్కర్లు కొట్టడంతో జనాలు.. ప్రధాని, సీఎం పరువు తీసేశారంటూ చీవాట్లు పెడుతున్నారు.ఫ్లెక్సీల్లో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు సీఎం నవ్వుతూ ఉన్న ఫోటోలు వేయడంతో నెటిజన్లు ‘మీకు సిగ్గు, మర్యాద ఏమైనా ఉందా.. కరోనాతో శవరాజకీయాలు చేస్తారా’ అంటూ బీజేపీ నాయకులను తీవ్రంగా విమర్శిస్తున్నారు.