విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త..?

ప్రభుత్వ పాఠశాలల్లో సీబీఎస్​ఈ సిలబస్ ప్రవేశపెడుతున్నట్లు ఏపీ సర్కార్ ప్రకటించింది. పాఠశాల విద్యాశాఖ ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘2024-25 ఏడాదిలో పదో తరగతి విద్యార్థులు సీబీఎస్‌ఈ సిలబస్‌లో ఆంగ్ల మాధ్యమంలో పరీక్షలు రాసేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. పాఠశాలల నిర్వాహకులు, ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆంగ్ల మాధ్యమంలో ఈ బోర్డు ద్వారా పరీక్షలు నిర్వహించే సామర్థ్యాన్ని పెంపొందిస్తామని, మూడు, అయిదు, ఎనిమిది తరగతుల విద్యార్థుల సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 73శాతం పాఠశాలలను ప్రభుత్వమే నడుపుతోంది. ఈ రెండేళ్లలో 6,13,000 మంది విద్యార్థులు కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని ఇందులో నాలుగు లక్షల మంది ప్రైవేటు పాఠశాలల నుంచి వచ్చిన వారే అని సర్కార్ పేర్కొంది. సీబీఎస్‌ఈలో దేశంలోని విద్యా సంస్థలతో పాటు 26 దేశాల్లోని 25 వేలకు పైగా పాఠశాలలు అనుబంధంగా ఉన్నాయని ఏపీ విద్యాశాఖ తెలిపింది. రాష్ట్రంలోని పాఠశాలల్లో సీబీఎస్ఈ సిలబస్ తేవడం ఒక శుభపరిణామమని జగన్ సర్కార్ సంతోషం వ్యక్తం చేసింది.