ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో వరుస విజయాలతో దూసుకుపోతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు బిగ్ షాక్ తగిలింది. ఈ జట్టుకు చెందిన ఇద్దరు ఆస్ట్రేలియా బౌలర్లు ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్సన్ ఐపీఎల్ను వీడారు. వ్యక్తిగత కారణాలతో వీరిద్దరూ ఐపీఎల్కు వీడ్కోలు పలికి ఆస్ట్రేలియా వెళ్లిపోతున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని కోహ్లీ సేన అధికారిక ప్రకటించింది. `ఆడమ్ జంపా, కేన్ రిచర్డ్ సన్ వ్యక్తిగత కారణాలతో ఆస్ట్రేలియాకు తిరిగి వెళుతున్నారు. వారు తదుపరి ఐపీఎల్ సీజన్ కు అందుబాటులో ఉండరు. వారు తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నాం. వారికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం` అని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ట్విట్టర్ ఖాతాలో తెలియజేసింది.
ఇక మరోవైపు రాజస్థాన్ రాయల్స్ కు చెందిన ఆండ్రూ టై కూడా ఐపీఎల్ను వీడాడు. ఆండ్రూ కూడా వ్యక్తిగత కారణాల వల్ల టోర్నీకి దూరం అవుతున్నారు. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది.