గత ఏడాది ఉగాది పర్వదినాన మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు ప్రేక్షకులకు, అభిమానులకు మరింత చేరువ అయ్యేందుకు ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలా అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్లోకి అడుగు పెట్టాడు చిరు.
ఇక చిరు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారో.. లేదో.. ఆయన్ను ఫాలో అయ్యే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వచ్చింది. అయితే ఆయన మాత్రం ఫాలో అయ్యేది ఒక్కరినే. అది కూడా ట్విట్టర్లో. ఇంతకీ ట్విట్టర్లో చిరు ఫాలో అయ్యేది ఎవరో కాదు.. సినీ గేయ రచయిత రామ జోగయ్య శాస్త్రి.
ఈ విషయాన్ని గుర్తించిన ఒక నెటిజన్.. `సర్, మీరు గమనించారో లేదో చిరంజీవి గారు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న ఏకైక వ్యక్తి మీరు. మీ సుసంపన్నమైన జ్ఞానానికి అది చిరంజీవి గారు మీకు ఇచ్చిన బహుమతి` అని ఓ ట్వీట్ చేశాడు. ఇది గమనించిన రామ జోగయ్య శాస్త్రి స్పందిస్తూ..`చిరంజీవి సర్ ప్రేమ, ఆశీర్వాదాలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. కొండంత సంతోషంగా ఉన్నాను` అని పేర్కొన్నారు.