నిత్యం రాజకీయాల్లో సతమతం అయ్యే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమారుడు కేటీఆర్, కూతురు కవితలు.. రాఖీ పండుగ సందర్భంగా తమ స్పెషాలిటీని మరోసారి రాష్ట్రానికి చాటారు. ప్రతి విషయంలోనూ ఇద్దరు ఎవరికి వారే స్పెషల్గా ఉంటున్న విషయం తెలిసిందే. తాను ఎంపీ అయినప్పటికీ.. బోనాల పండుగ వస్తే.. చాలు.. సాధారణ మహిళగామారిపోయి.. నెత్తిన బోనం ఎత్తుకుని.. పాటలు పాడుతుంది కవిత. అదేవిధంగా కేటీఆర్ కూడా. తాను మంత్రి అయినప్పటికీ.. ప్రొటోకాల్ వంటివి పక్కన పెట్టి వర్షం పడిన సమయంలో స్వయంగా ట్రాఫిక్ను క్లియర్ చేయడం, రోడ్లు ఎలా ఉన్నాయో చూడడం వంటి వి ఆయన అనేక సార్లు చేసి.. తనలోని సామాజిక స్పృహను బయట పెట్టుకున్నారు.
ఇప్పుడు తాజాగా ఈ ఇద్దరు నేతలూ.. మరోసారి తమలోని సామాజిక స్పృహను బయట పెట్టుకునేందుకు రాఖీ పండుగను వినియోగించుకున్నారు. దీంతో ఇప్పుడు తెలంగాణలో ఈ అన్నా చెల్లెళ్లకు క్రేజ్ అమాంతం పెరిగిపోయిందట. సోమవారం రాఖీ పండుగను పురస్కరించుకుని.. తన తోబుట్టువు మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టింది నిజామాబాద్ ఎంపీ అయిన కవిత.
ఈ సందర్భంగా అందరూ అన్నయ్య నోటిని తీపి చేయడం సహజం అయితే, అందుకు భిన్నంగా కవిత.. అన్నయ్యకు గిఫ్ట్గా ఓ హెల్మెట్ను ఇచ్చింది. ఇటీవల కాలంలో హైదాబాద్లో పెరిగిపోతున్న రోడ్డు ప్రమాదాలకు కారణం హెల్మెట్ ధరించకపోవడమేనని కవిత పలు సందర్భాల్లో చెప్పడమే కాదు. హెల్మెట్ ధరించే ప్రచారం చేస్తోంది కూడా.
వాహనాన్ని నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని కోరుతూ అందరు చెల్లెళ్లూ.. తమ అన్నయ్యలకు హెల్మెట్ను బహుమతిగా ఇవ్వాలన్న పిలుపుతో కవిత ప్రచారం చేస్తున్నారు. తాను మాటల మనిషిని మాత్రమే కాదు చేతల మనిషిని కూడా అన్నట్లు.. బైక్ నడిపే వీలు లేనప్పటికీ మంత్రి కేటీఆర్ కు హెల్మెట్ను బహుకరించారు కవిత. ఇక, కేటీఆర్ విషయానికి వచ్చేసరికి.. రాష్ట్రంలో చేనేత రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు వీలుగా చేనేత వస్త్రాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు మంత్రి కేటీఆర్.
చేనేత వస్త్రాలకు తాను చేస్తున్న ప్రచారానికి తగ్గట్లే.. రాఖీ పండక్కి తన సోదరి కవితకు చేనేత చీరను బహుమతిగా అందించటం విశేషం. ఇలా.. రాఖీ పండగ సందర్భంగా తాము చేసే సామాజిక అంశాలు ప్రతిబింబించేలా కేటీఆర్.. కవితలు వ్యవహరించటంతో రాష్ట్ర వ్యాప్తంగా వీరిద్దరికీ రేటింగ్ అమాంతం పెరిగిపోయింది!!