సీఎం నారా చంద్రబాబు, ఆయన తనయుడు పొరపాటున ఏదైనా మాట జారితే.. దాని గురించి వైసీపీ నేతలు ఎంత రచ్చ చేశారు! ఎన్ని మాటలు అన్నారు! సోషల్ మీడియాలో ఎంతటి ప్రచారం కల్పించారు! ముఖ్యంగా లోకేష్ వ్యాఖ్యలను పదేపదే టీవీలో చూపిస్తూ.. పత్రికల్లో బ్యానర్ హెడ్డింగులు చేస్తూ.. ఆడిపోసుకున్నారు. మరి ఇప్పుడు స్వయంగా వాళ్ల అధినేత జగన్ తడబడ్డారు. నిందితులను అనబోయి ఏకంగా బాధితులనే అరెస్టుచేయాలని సలహాలిచ్చారు. మరి ఈ వ్యాఖ్యలపై వైసీపీ నేతలు ఏ సమాధానం చెబుతారో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం జగన్పై సెటైర్ల మీద సెటైర్లు పడుతున్నాయి.
అసలే రాజకీయాలు కొత్త, పెద్ద పెద్ద సమావేశాల్లో ఆ జనసందోహాన్ని చూసిన కొన్ని సందర్భాల్లో కొన్ని సార్లు మాటలు తడబడటం సర్వసాధారణం! వాటిని భూతద్దంలో చూపి.. మంత్రి లోకేష్పై తీవ్రంగా దుమ్మెత్తిపోశారు జగన్ అండ్ కో!! ఇప్పుడు అదే జగన్ అడ్డంగా దొరికిపోయారు. పశ్చిమగోదావరి జిల్లా.. గరగపర్రు లో కొద్ది రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి, అక్కడ రెండు వార్గాల వారిని పరామర్శించి.. సర్దిచెప్పేందుకు జగన్.. అక్కడ పర్యటించిన విషయం తెలిసిందే! ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ `చట్టం తనపని తాను చేసుకుని పోయుంటే సమస్య ఇంత దూరం వచ్చుండేదే కాదు. ఘటన జరిగినప్పుడే బాధితుల్ని అరెస్టు చేసి ఉంటే ఇంత దూరం వచ్చేది కాదు’ అన్నారు.
ఇక్కడే జగన్ ప్రజలకు, సోషల్ మీడియాకు దొరికపోయారు. ఎప్పుడు ఎవరు దొరుకుతారా? వారిని బకరా చేసేద్దామని వెయిట్ చేస్తున్న సోషల్ మీడియాకు.. జగన్ చిక్కారు! ఇంకేముంది! వాళ్లంతా ఓ ఆట ఆడుకుంటున్నారు. నిందితులని అరెస్టు చేయాలా? లేక బాధితులను అరెస్టు చేయాలా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వీడియో సాక్ష్యంతో సహా జగన్ కూడా ఈ సారి అడ్డంగా బుక్కయ్యారు. ఇంత కాలం చంద్రబాబు, లోకేష్ పై ఇలాంటి విమర్శలు చేస్తున్న వైసీపీ శ్రేణులకు జగన్ వ్యాఖ్యలు గొంతులో వెలక్కాయలా పడింది. ఇప్పుడు టీడీపీ శ్రేణులు ఈ వీడియోను జోరుగా షేర్ చేస్తున్నాయి.
తన దాకా వస్తేగాని తెలియదేమో.. అన్నది వైసీపీ అధినేత జగన్కు ఇప్పుడు తెలిసొచ్చుంటుంది. మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబు నోబెల్ ఇచ్చేస్తా అని ఒక సందర్భంలో అన్న వ్యాఖ్యలను వక్రీకరించి.. కొత్త భాష్యాలు చెప్పింది. అలాగే ఆయన తనయుడు లోకేష్ చేసిన వ్యాఖ్యలపై.. జగన్ మాట్లాడుకోవడం నేర్చుకోవాలని, ఇలాంటి మంత్రి ఉండటం దౌర్భాగ్యం అంటూ భారీ డైలాగులే పీకారు వైసీపీ ఎమ్మెల్యే రోజా! మరి ఇప్పుడు తమ నాయకుడు చేసిన వ్యాఖ్యలపై ఆమె ఎలా స్పందిస్తారని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి.