ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఇద్దరు ఎంపీలకు చంద్రబాబు కోడలు బ్రాహ్మణి టెన్షన్ పట్టుకున్నట్టే అక్కడ రాజకీయ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతం లోకేశ్ మంత్రి అయినా తెరవెనక తతంగాన్ని మొత్తం చక్కపెడుతోన్న బ్రాహ్మణికి మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయన్న టాక్ ఆల్రెడీ వచ్చేసింది. ఈ నేపథ్యంలోనే కోడలిని వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దించాలని చంద్రబాబు డైరెక్టుగా కాకపోయినా అప్పుడే చాపకింద నీరులా తన ప్రయత్నాలు స్టార్ట్ చేసేశారు.
లోకేశ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగూ ఎమ్మెల్యేగా పోటీ చేయడం ఖాయం. ఇక బ్రాహ్మణిని ఎంపీగా బరిలోకి దించాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్టు గత ఆరేడు నెలలుగా వార్తలు వస్తున్నాయి. బ్రాహ్మణి సైతం ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వార్తలే ఇప్పుడు ఏపీలో ఇద్దరు టీడీపీ ఎంపీలను తీవ్రంగా టెన్షన్ పెట్టేస్తున్నాయి.
బ్రాహ్మణి ఎంపీగా పోటీ చేస్తే గుంటూరు లేదా విజయవాడ లోక్సభ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఆమె ఎక్కడ పోటీ చేస్తుందన్నది క్లారిటీ లేకపోయినా ఈ రెండు నియోజకవర్గాలపైనే బ్రాహ్మణి, బాబు దృష్టి ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె విజయవాడ నుంచి పోటీ చేస్తే ఇక్కడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నానికి షాక్ తప్పదు. ఒక వేళ ఆమె గుంటూరు బరిలో ఉంటే అక్కడ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ను తప్పించాలి. దీంతో ఇప్పుడు బ్రాహ్మణి తమ సీట్లలో ఎవరికి ఎర్త్ పెడుతుందా ? అని వీరిద్దరు తమ అనుచరుల వద్ద ఈ అంశంపై చర్చలు జరుపుతూ తీవ్ర టెన్షన్లో ఉన్నారట.
బ్రాహ్మణి గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తే అక్కడ సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ను చంద్రబాబు చిత్తూరు జిల్లా చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారని తెలుస్తోంది. ఇక ఆమె విజయవాడ బరిలో ఉంటే కేశినేని నానిని తప్పించి ఆయనకు నామినేటెడ్ పోస్టు లేదా ఎమ్మెల్సీ ఇస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరు మాత్రం మరోసారి ఎంపీగా పోటీ చేసేందుకే ఆసక్తితో ఉన్నట్టు భోగట్టా. అందుకే బ్రాహ్మణి ఎంపీగా పోటీ చేస్తారన్న వార్తలు వీరిని కలవరపాటుకు గురి చేస్తున్నాయని తెలుస్తోంది.