ఏపీ సీఎం చంద్రబాబుకు ఇప్పుడు కంటిపై కునుకులేకుండా పోతోందట. ఫుల్లు ఏసీలోనూ ముచ్చెమటలు పడుతున్నాయట! దీనికి కారణం.. ఓ రెండు విషయాలని అధికారులు చెబుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితిలోనూ గెలిచి సీఎం సీటును పదిలం చేసుకోవాలని భావిస్తున్న చంద్రబాబు.. రాష్ట్ర ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రధానంగా రెండు విషయాలను ఎంచుకున్నారు. ఎక్కడ ఏ సభలో మాట్లాడినా ఆరెండు విషయాలు చెప్పకుండా ఆయన ఉండలేకపోతున్నారు. దీంతో ఆ రెండు విషయాలే ఇప్పుడు ఆయనకు కంటిపై కునుకులేకుండా చేస్తున్నాయట.
ఇంతకీ ఆ రెండు ఏంటంటే.. ఒకటి పోలవరం ప్రాజెక్టు పూర్తి, రెండు అమరావతి నిర్మాణం. ఈ రెండు విషయాలు ఇప్పుడు బాబుకు నిద్ర పట్టనివ్వడం లేదు. దాదాపు 16 వే ల కోట్ల లోటు బడ్జెట్తో ఏర్పడ్డ ఏపీలో ఈ రెండు నిర్మాణాలు చేపట్టడం అంటే ఆషామాషీ కాదు. అయితే, దీనిలో పోలవరం పూర్తిగా కేంద్ర ప్రాజెక్టే అయినా.. అమరావతి మాత్రం పూర్తిగా రాష్ట్ర ప్రాజెక్టు. దీనికి కొంత మేరకు మాత్రమే విభజన చట్టం ప్రకారం కేంద్రం నిధులు ఇస్తుంది.
అయితే, చంద్రబాబు వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. హైదరాబాద్లో సైబర్ సిటీని తానే అబివృద్ధి చేశానని పదేపదే చెప్పుకొంటున్న ఆయన ఇప్పుడు ఏపీలో పోలవరం, అమరావతిలను తన ఖాతాలో వేసుకునేందుకు, వీటిని చూపించి ఎన్నికల్లో తిరిగి గెలిచేందుకు ప్లాన్ వేశారు. ఈ క్రమంలోనే ప్రతి సోమవారం సమీక్షలు, నెలకోసారి విజిట్లు చేస్తున్నారు.
అంతా బాగానే ఉన్నా నిధుల లేమి, యంత్రాలు లేకపోవడం, వాతావరణం సహకరించకపోవడం, ప్లానింగ్, అనుమతులు ఇంకా రాకపోవడం శాపంగా పరిణమించడంతో ఇవి అనుకున్న సమయానికి అవుతాయా లేదా అని బాబు.. తెగ ఫీలై పోయి నిద్ర కూడా పోవడం లేదని అమరావతి వర్గాల సమాచారం. సో.. మరి ఎప్పుడు పూర్తవుతాయో చూడాలి.