టీడీపీలోకి అశోక్‌బాబు…. ఎమ్మెల్సీపై గురి..!

ఏపీఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు ఉద్యోగుల కోసం చేసే ప‌నిలో ఆయ‌న‌కు ఎన్ని మంచి మార్కులు వ‌చ్చినా, ఆయ‌న చంద్ర‌బాబుకు కాస్త ఫేవ‌ర్‌గా ఉంటార‌న్న టాక్ ఆయ‌నపై ఎప్ప‌టి నుంచో ఉంది. గ‌త ఎన్నిక‌ల‌కు ముందే ఆయ‌న టీడీపీలోకి వ‌స్తార‌న్న వార్త‌లు వ‌చ్చినా అవి ఆ త‌ర్వాత సైలెంట్ అయ్యాయి. వీలున్న‌ప్పుడల్లా అశోక్‌బాబు చంద్రబాబును డ‌ప్పును లైట్‌గా అయినా కొట్టేస్తుంటారు.

తాజాగా నవ నిర్మాణ దీక్షల ముగింపు సందర్భంగా కాకినాడలో నిర్వహించిన సభలో ముఖ్యమంత్రిపై అశోక్‌ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. ఏపీకి చంద్ర‌బాబే ఎప్ప‌ట‌కీ సీఎంగా ఉండాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. చంద్ర‌బాబు మీద ఆయ‌న‌కు మ‌రీ ప్రేమ ఎక్కువైపోయిందే అని చాలా మంది అనుకున్నారు. కానీ అస‌లు క‌థ వేరే ఉంద‌ని తెలుస్తోంది.

జులై1 నుంచి జిఎస్టీ అమల్లోకి వస్తే ప్ర‌స్తుతం ఏపీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న ఆయ‌న ఆ ప‌ద‌విలో ఉండ‌డం కుద‌ర‌దు అట‌. ఆయ‌న ప్ర‌మోష‌న్ ద్వారా గెజిటెడ్ ఆఫీస‌ర్ల కేట‌గిరిలోకి వెళ్లిపోతారు. దీంతో ఆయ‌న త‌న ఫ్యూచ‌ర్ ప్లాన్‌ను టీడీపీతో ప్లాన్ చేసుకుంటున్న‌ట్టు తెలుస్తోంది. టీడీపీలోకి జంప్ చేసి చంద్ర‌బాబును కాకా పట్టి, గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీ పోస్టుకు నామినేట్ అవ్వాల‌న్న‌దే ఆయ‌న ప్లాన్‌గా తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే అశోక్‌బాబు చంద్ర‌బాబును ప్ర‌స‌న్నం చేసుకునేందుకు ఆయ‌న‌పై బ‌హిరంగంగానే పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపించేస్తున్న‌ట్టు క‌న‌ప‌డుతోంది. ఈనేపథ్యంలో అశోక్ బాబును తెలంగాణలో మాదిరిగానే శ్రీనివాసగౌడ్, దేవీ ప్రసాద్‌లా ఆయ‌న‌కు ఏమైనా ప‌ద‌వులు ఇస్తారా ?  లేదా ప‌క్క‌న పెడ‌తారా ? అన్న‌ది చంద్ర‌బాబుకే ఎరుక‌..!