ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశవ్యాప్తంగా జమిలీ ఎన్నికలకు శ్రీకారం చుట్టనుండడంతో రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణలో కూడా 2018లోనే ఎన్నికలు జరుగుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వచ్చే యేడాదిలోనే ఎన్నికలకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా సై అన్నట్టు టాక్. ఇదిలా ఉంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశానికి ఉన్నంత సినీగ్లామర్ మరే పార్టీకి లేదు.
టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం సినిమా రంగం నుంచి రావడంతో ఎక్కువ మంది సినిమా వాళ్లు ఆ పార్టీవైపే మొగ్గుచూపారు. టీడీపీ తరపున వివిధ పదవులు అనుభవించారు. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు టీడీపీ కాస్త స్పీడ్గేర్లోనే ముందుకు వెళుతోంది. 2018లో ఎన్నికలు జరిగితే వైసీపీ గెలిచి జగన్ సీఎం కాకపోతే ఆ పార్టికి పొలిటికల్ ఫ్యూచర్ ఉంటుందా ? అన్న సందేహాలు చాలా మందిలో కలుగుతున్నాయి.
దీంతో వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు విపక్ష వైసీపీ అధినేత జగన్ సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే ఇతర పార్టీలకు చెందిన పలువురు సీనియర్లతో పాటు వారసులను తన వైపునకు లాక్కుంటోన్న జగన్ తన పార్టీకి సినీగ్లామర్ను కూడా ఎటాచ్ చేసేపనిలో ఉన్నట్టు టాక్.
ఈ క్రమంలోనే నిన్నటి తరం సీనియర్ హీరో సుమన్, రాజశేఖర్ – జీవిత దంపతులతో పాటు రాశి ఈ ముగ్గురిని వైసీపీలోకి తీసుకెళ్లేందుకు చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. సుమన్ వైసీపీ తరపున వచ్చే ఎన్నికల్లో గుంటూరు జిల్లాలోని ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.
ఇక రాశి, జీవిత – రాజశేఖర్ దంపతులకు టిక్కెట్లు వచ్చినా రాకపోయినా వారు కూడా వచ్చే ఎన్నికల్లో వైసీపీలో కీ రోల్ పోషిస్తారని సమాచారం. జీవిత – రాజశేఖర్ దంపతులకు గతంలో జగన్తో దగ్గరి అనుబంధం ఉన్నా తర్వాత వారు దూరమయ్యారు. మరోసారి వారు జగన్కు దగ్గరవుతున్నారట. మరి ఈ కొత్త సినీగ్లామర్ జగన్కు ఎంత వరకు హెల్ఫ్ అవుతుందో చూడాలి.