జ‌గ‌న్‌కు మ‌ద్ద‌తుగా వైసీపీ ఎంపీ కొత్త న్యూస్ ఛానెల్‌

రాజ‌కీయ పార్టీల‌కు మీడియా అండ త‌ప్ప‌నిస‌రి అయిన‌ రోజులివి. అందుకే ఏదో ఒక పార్టీకి ఏదో ఒక మీడియా.. తన వంతు సాయం చేస్తూ వ‌స్తోంది. ముఖ్యంగా ఏపీలో అధికార పార్టీకి మ‌ద్దతు ఇచ్చే మీడియానే ఎక్కువ‌గా ఉండ‌గా.. ప్ర‌తిప‌క్షాన్ని పట్టించుకునే మీడియా ఒకే ఒక్క‌టి ఉంది. ఈ ఆంతర్యాన్ని త‌గ్గించేందుకు వైసీపీ న‌డుం బిగించింది. వైసీపీని ప్రొజెక్టు చేసేందుకు ఆ పార్టీ ఎంపీ రంగంలోకి దిగారు. ఏకంగా ఇప్పుడు ఆయ‌న ఒక చానెల్‌ను త్వ‌ర‌లో ప్రారంభించ‌బోతున్నారు. టీడీపీ వైఫ‌ల్యాల‌ను ఎండ‌గడుతూ.. ఇదే స‌మ‌యంలో జ‌గ‌న్‌కు పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు దీనిని మొద‌లుపెట్ట‌నున్నారు.

ఎలక్ట్రానిక్ మీడియా నష్టాల్లో నడుస్తోందని తెలిసినా చాలా మందికి దానిమీద మోజు మాత్రం తగ్గడం లేదు. అయితే మీడియాని పూర్తిగా వ్యాపార కోణంలోనే చూస్తున్నవారు మాత్రం.. ఛానల్ మాట ఎత్తడం లేదు. కొందరు రాజకీయ నేతలకు మాత్రం ఇంకా ఛానెల్స్ మోజు పోలేదు. ఛానల్ చేతిలో ఉంటే జనం అభిప్రాయాన్ని మార్చవచ్చనేది వాళ్ల ప్ర‌గాఢ న‌మ్మ‌కం. అందుకే డబ్బు పోతుందని తెలిసినా దానిని లెక్క చేయ‌కుండా ఛానల్ నిర్వహణకు ముందుకొస్తున్నారు. తెలంగాణాలో ఇప్పటికే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటికే రాజ్ న్యూస్ లీజ్ కి తీసుకుని ఉద్యోగుల నియామకం కూడా చేపట్టారు.

ఇక ఆంధ్రప్రదేశ్ లోనూ ఓ కొత్త ఛానల్ రాబోతున్నట్టు తెలుస్తోంది.ఈ ఛానల్ సాక్షికి పోటీగా వైసీపీ భజన చేయబోతోంది. వైసీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి,ఆయన కుమారుడు,జగన్ స్నేహితుడు, రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ఏపీలో కొత్త ఛానల్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. డిజిటల్ మీడియా లో వైసీపీ హవా కొనసాగుతున్నప్పటికీ.. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో టీడీపీ ధాటికి తట్టుకోలేకపోతున్నామని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయనే పార్టీ కి అనుకూలంగా ఉండే ఇంకో ఛానల్ పెట్టాల‌ని తన స్నేహితుడు మిధున్ రెడ్డి ని ప్రోత్సహించినట్టు తెలుస్తోంది.

ఇప్ప‌టికే జ‌గ‌న్‌కు చెందిన కార్య‌క్ర‌మాల‌న్నీ ప్ర‌చారం చేయ‌డానికి సాక్షి ఉండ‌నే ఉంది. కానీ అధికార పార్టీకి ఎక్కువ మీడియా అండ ఉండ‌టంతో సొంతంగా ప్రొజెక్ట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు జ‌గ‌న్‌. అందుకే ఈ కొత్త చానెల్‌ను ప్రారంభించాల‌ని నిర్ణ‌యించార‌న‌ట‌. ఈ ప్లాన్ కార్యరూపం దాలిస్తే త్వరలో ఏపీ లో సాక్షికి ధీటుగా జగన్ భజన చేసే ఛానల్ మ‌రొక‌టి వ‌చ్చిన‌ట్టే!!