ఏపీలో కేబినెట్ కూర్పు సెగలు పొగలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే కేబినెట్లో చోటు దక్కని నేతలకు చంద్రబాబు వద్ద ఘోరమైన అవమానం ఎదురవుతోంది. ఈ క్రమంలోనే మంత్రి పదవి దక్కని ఓ టీడీపీ సీనియర్ను చంద్రబాబు అస్సలు పట్టించుకోకపోవడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర పేరును సైతం మంత్రివర్గ పరిశీలనలోకి తీసుకోలేదు.
ఈ క్రమంలోనే నరేంద్ర ఎమ్మెల్యే పదవితో పాటు పార్టీకి కూడా రాజీనామాలు చేయాలని ఆయన అనుచరులు ఒత్తిడి చేస్తున్నారు. నరేంద్రకు ఎంతో మంది నచ్చ చెపుతున్నా ఆయన మాత్రం సంతృప్తి చెందడం లేదు. కుల సమీకరణాల్లోనే నరేంద్రకు స్థానం దక్కలేదు. నరేంద్ర కమ్మ సామాజికవర్గానికి చెందిన వారు. ఇప్పటికే కేబినెట్లో ఆ వర్గం నుంచి ఐదుగురు మంత్రులు ఉండడంతో ఆయనకు ఛాన్స్ దక్కలేదు. ఇదిలా ఉంటే నరేంద్రను సంతృప్తి పరిచేందుకు చంద్రబాబు మధ్యేమార్గంగా ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావును చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఆయన రాజీనామా చేసే ఏపీ టీడీపీ అధ్యక్ష బాధ్యతలను నరేంద్రకు ఇవ్వాలని బాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు పార్టీలో సీనియర్ మంత్రుల అభిప్రాయాన్ని కూడా అడిగి తెలుసుకున్నట్టు టాక్. మంత్రి పదవి రాలేదని అసంతృప్తితో ఉన్న నరేంద్ర చల్లబడతాడేమో చూడాలి.