మంత్రి వర్గ విస్తరణ వేళ.. సీఎం చంద్రబాబు సరికొత్త టెన్షన్ మొదలైంది. పైకి అంతా బాగానే కనిపిస్తున్నా.. కర్నూలు జిల్లాలో మాత్రం పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఈసారి విస్తరణలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నంధ్యాల ఎమ్మెల్యే భూమానాగిరెడ్డికి చోటు దక్కవచ్చనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో భూమా చేరికను తొలి నుంచి వ్యతిరేకిస్తున్న శిల్పా వర్గం.. వైసీపీలో చేరవచ్చచే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఏమి చేయాలో పాలుపోని స్థితిలో చంద్రబాబు ఉన్నారట.
ఏడాది కాలం నుంచి మంత్రి వర్గ విస్తరణ కోసం పార్టీలోని సీనియర్ నేతలు ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి కూడా మంత్రి పదవి హామీ ఇచ్చి ఆహ్వానించారు చంద్రబాబు. అయితే ఇప్పుడు ఆ విస్తరణ జరిగేందుకు సమయం రావడంతో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే విస్తరణంటూ జరిగితే ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటా? అనే ప్రశ్న తెలుగుదేశం వర్గాలను తొలిచేస్తోందట! ఫిరాయింపుదారులకు పదవులు ఇస్తే ప్రతిపక్షాలకు ఒక బలమైన విమర్శనాస్త్రం అందించినట్టే అవుతుంది. అయితే వారికి పదవులు ఇస్తే సొంత పార్టీ నేతల నుంచీ తలనొప్పులు ఖాయం అన్నట్టుగానే కనిపిస్తున్నాయి.
ముఖ్యంగా భూమా నాగిరెడ్డి విషయంలో ఇదే జరిగేట్టు కనిపిస్తోంది. ఆయనకు పదవి ఇస్తే ఒక తలనొప్పి, ఇవ్వకుంటే ఇంకో సమస్య అన్నట్టు మారింది పరిస్థితి! భూమాకి పదవి ఇస్తే తాము చూస్తూ ఊరుకునేది లేదని శిల్పా వర్గం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది! భూమా మంత్రి కాగానే పార్టీలో పరిస్థితులు ఎలా మారుతాయో టీడీపీ ఊహకే అందటం లేదని చెప్పుకుంటున్నారు. పోనీ… శిల్పా వర్గాన్ని బుజ్జగిస్తూ, భూమాని కాదని వేరే వారికి పదవి ఇస్తే అది ఇంకో సమస్య అవుతుంది! పదవుల ఆశతో వచ్చిన ఫిరాయింపుదారులు రివర్స్ అయ్యే అవకాశం ఉంది.
పార్టీలో తమకు సరైన గుర్తింపు ఉండటం లేదని, ఆశించిన తాయిలాలు అందడం లేదని ఫిరాయింపు నేతలు అసంతృప్తితో రగులుతున్నారట. ఫిరాయింపుదారుల్లో అందరికీ మంత్రి పదవులు దక్కకపోయినా, భూమా లాంటి వారికి ఇవ్వకపోతే ఇప్పుడు తమ పరిస్థితి ఏంటా? అనే సందేహంలో ఉన్నారు. మరి, ఈ పరిస్థితుల్లో చంద్రబాబుకు.. ఉగాది గండం ఎలా గట్టెక్కుతుందో వేచి చూడాల్సిందే. ఇప్పుడు మంత్రి వర్గ విస్తరణ లేదంటే.. పార్టీలోని ఆశావహులు అంతా తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. పదవి ఇచ్చినా.. ఇవ్వకపోయినా తలనొప్పులే కదా! మరి విస్తరణం ఎలా ఉంటుందో!