2017 సీక్వెళ్ల నామ సంవ‌త్స‌ర‌మే

ఒక‌ప్పుడు హాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా న‌డిచేది. త‌ర్వాత అది బాలీవుడ్‌కు పాకింది. ఇప్పుడు అది సౌత్ ఇండియాలో తెలుగు, త‌మిళ భాష‌ల్లో కూడా జోరుగా న‌డుస్తోంది. ముందుగా తీసిన సినిమా హిట్ అయితే దానికి కొన‌సాగింపుగా సీక్వెల్ తీస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే 2017 సంవ‌త్స‌రం టాలీవుడ్‌లో సీక్వెల్స్ నామ‌సంవ‌త్స‌రంగా మార‌నుంది. ఈ యేడాది ఇక్క‌డ సీక్వెల్స్, పార్ట్‌-2లో హోరెత్తించ‌నున్నాయి.

వీటిలో ఎక్కువ ఆస‌క్తి రేపుతున్న చిత్రం బాహుబ‌లి 2. ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన బాహుబ‌లి సినిమాకు కొన‌సాగింపుగా వ‌స్తోన్న బాహుబ‌లి 2 స‌మ్మ‌ర్ కానుక‌గా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఇండియ‌న్ సినిమా జ‌నాలు సైతం ఆస‌క్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిన్న సినిమా రాజుగారి గ‌ది మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరో నాగార్జున న‌టిస్తుండ‌డం మ‌రింత హైప్ తెచ్చింది.

ఇక హ‌రి-సూర్య కాంబోలో వ‌చ్చిన సింగం సిరీస్ సినిమాల‌కు సౌత్ ఇండియాలోనే సూప‌ర్ క్రేజ్ ఉంది. ఈ సిరీస్‌లో వ‌స్తోన్న మూడో సినిమా సీ -3 ఈ నెల 26న వ‌స్తోంది. ఇక ర‌జ‌నీ-శంక‌ర్ గ్రాఫిక్స్ మాయాజాలం రోబోకు సీక్వెల్‌గా వ‌స్తోన్న రోబో 2 ద‌స‌రాకు రానుంది. ఇక క‌మ‌ల్ విశ్వ‌రూపం 2 ఆయ‌న తాజాగా న‌టిస్తోన్న శ‌భాస్ నాయుడు సినిమా త‌ర్వాత రిలీజ్ కానుంది.

ఇక ర‌జ‌నీ అల్లుడు ధ‌నుష్ న‌టిస్తోన్న వి.ఐ.పి 2 సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బీటౌన్‌లో వ‌ర్మ‌-అమితాబ్ స‌ర్కార్ 3పై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమ మార్చి 17న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఏదేమైనా ఈ యేడాది అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల్లోను….ఇంకా చెప్పాలంటే తెలుగులో ఎక్కువ సీక్వెల్స్ వ‌స్తున్నాయి. ఈ సీక్వెల్స్ ఎంత వ‌ర‌కు విజ‌యాన్ని అందుకుంటాయో చూడాలి.