ఒకప్పుడు హాలీవుడ్లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడిచేది. తర్వాత అది బాలీవుడ్కు పాకింది. ఇప్పుడు అది సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ భాషల్లో కూడా జోరుగా నడుస్తోంది. ముందుగా తీసిన సినిమా హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్ తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2017 సంవత్సరం టాలీవుడ్లో సీక్వెల్స్ నామసంవత్సరంగా మారనుంది. ఈ యేడాది ఇక్కడ సీక్వెల్స్, పార్ట్-2లో హోరెత్తించనున్నాయి.
వీటిలో ఎక్కువ ఆసక్తి రేపుతున్న చిత్రం బాహుబలి 2. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాకు కొనసాగింపుగా వస్తోన్న బాహుబలి 2 సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం ఇండియన్ సినిమా జనాలు సైతం ఆసక్తితో వెయిట్ చేస్తున్నారు. ఇక ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిన్న సినిమా రాజుగారి గది మంచి హిట్ అయ్యింది. ఆ సినిమా సీక్వెల్ రెడీ అవుతోంది. ఈ సినిమాలో స్టార్ హీరో నాగార్జున నటిస్తుండడం మరింత హైప్ తెచ్చింది.
ఇక హరి-సూర్య కాంబోలో వచ్చిన సింగం సిరీస్ సినిమాలకు సౌత్ ఇండియాలోనే సూపర్ క్రేజ్ ఉంది. ఈ సిరీస్లో వస్తోన్న మూడో సినిమా సీ -3 ఈ నెల 26న వస్తోంది. ఇక రజనీ-శంకర్ గ్రాఫిక్స్ మాయాజాలం రోబోకు సీక్వెల్గా వస్తోన్న రోబో 2 దసరాకు రానుంది. ఇక కమల్ విశ్వరూపం 2 ఆయన తాజాగా నటిస్తోన్న శభాస్ నాయుడు సినిమా తర్వాత రిలీజ్ కానుంది.
ఇక రజనీ అల్లుడు ధనుష్ నటిస్తోన్న వి.ఐ.పి 2 సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఈ చిత్రంపైనా భారీ అంచనాలు ఉన్నాయి. ఇక బీటౌన్లో వర్మ-అమితాబ్ సర్కార్ 3పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమ మార్చి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా ఈ యేడాది అన్ని చిత్ర పరిశ్రమల్లోను….ఇంకా చెప్పాలంటే తెలుగులో ఎక్కువ సీక్వెల్స్ వస్తున్నాయి. ఈ సీక్వెల్స్ ఎంత వరకు విజయాన్ని అందుకుంటాయో చూడాలి.