వాళ్ల‌కు అదిరిపోయే షాక్ ఇచ్చిన చంద్ర‌బాబు

రాజకీయాల్లో స‌మ‌యానుకూలంగా వ్య‌వ‌హ‌రించాలి. ఎప్పుడు ఎవ‌రిని బాగా ఉప‌యోగించుకోవాలో.. ఎప్పుడు వారికి ప్రాధాన్య‌త త‌గ్గించాలో తెలుసుకుని ముందుకెళ్లాలి. ఇప్పుడు సీఎం చంద్ర‌బాబు చేస్తున్న ప‌ని కూడా అదే! నియోజ‌క‌వ‌ర్గానికి ఇన్‌చార్జ్‌లు కీల‌కం. అలాగే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఎమ్మెల్యేలు కూడా అంతే ముఖ్యం. అయితే ఇక్క‌డే అస‌లు స‌మ‌స్య వ‌చ్చింది. ముఖ్యంగా కొత్త‌గా పార్టీలోకి చేరిన ఎమ్మెల్యేల నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జుల హ‌వానే కొన‌సాగేది. కానీ ఇప్పుడు ఆ ఇన్‌చార్జులకు `పవ‌ర్‌` త‌గ్గించి కొత్త ఎమ్మెల్యేల‌కు అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌చెబుతున్నారు.

అధికారంలో త‌మ పార్టీ ఉండ‌టంతో.. ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో తెదేపా ఇన్‌చార్జులకు ఎదురే ఉండేది కాదు. కాంట్రాక్టులు, అభివృద్ధి ప‌నులు, ఉద్యోగ బదిలీలు ఇలా.. ఇన్‌చార్జుల క‌నుస‌న్న‌ల్లోనే జ‌రుగుతూ ఉండేవి. ఇన్‌చార్జుల వాహ‌నాల‌కు ముందు పోలీసు సెక్యూరిటీ, అధికారుల హంగామా.. ఇవ‌న్నీ ఉండేవి. ఇక ఎమ్మెల్యేలు ఉత్స‌వ విగ్ర‌హాలుగా ఉండేవారు. అయితే కొంత‌మంది ప్ర‌తిప‌క్ష ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోవ‌డంతో స‌మ‌స్య మొద‌లైంది. నియోజ‌క‌వ‌ర్గంలో ఇన్‌చార్జుల హ‌వా పెరిగిపోతుండ‌టంతో.. తాము నిస్స‌హాయులుగా మిగిలిపోయామ‌ని ప‌లువురు ఫిరాయింపు ఎమ్మెల్యేలు చంద్ర‌బాబు వ‌ద్ద వాపోయార‌ట‌.

ఇన్‌చార్జులు, ఎమ్మెల్యేల మ‌ధ్య గ్యాప్ గుర్తించిన చంద్ర‌బాబు.. వెంట‌నే న‌ష్ట‌నివార‌ణ చర్య‌లు చేప‌ట్టారు. ఎమ్మెల్యేల‌కు అధికారాలు క‌ల్పిస్తూ,, ఇన్‌చార్జుల ఆధిప‌త్యాన్ని త‌గ్గిస్తూ కొన్ని ఆదేశాలుజారీచేశారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేల‌కూ ప్రోటోకాల్ ఇవ్వాల‌ని, వారు చెప్పిన‌ట్టు న‌డుచుకోవాల‌ని స్ప‌ష్టంచేశారు. అయితే ఇన్‌చార్జుల‌కు ప్రోటోకాల్ అవ‌స‌రం లేద‌ని అభిప్రాయ‌ప‌డ్డార‌ట‌. దీంతో ఆయా నియోజక‌వ‌ర్గాల్లో ఇన్‌చార్జులు వాపోతున్నారు. త‌మ‌ను పూచిక‌పుల్ల‌లా చంద్ర‌బాబు తీసి పాడేసారి ఆవేద‌న వ్య‌క్తంచేస్తున్నారు.