ఎమ్మెల్యేల‌ని కాల్చేయండి.. న‌క్స‌ల్స్‌కి వీర్రాజు పిలుపు!

బీజేపీ ఎమ్మెల్సీ.. సోము వీర్రాజు ఉన్న‌ట్టుండి మ‌ళ్లీ వార్త‌ల్లో మెరిశారు. మెరుపు అంటే అలాంటి ఇలాంటి మెరుపు కాద‌న్న‌మాట‌! సంచ‌ల‌నం సృష్టించారు. నిన్న మొన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీకి మిత్ర‌ప‌క్షంగా ఉన్నామ‌నే విష‌యం కూడా మ‌రిచిపోయి.. పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు గుప్పించిన ఆయ‌న త‌న‌కు బీజేపీ అధ్య‌క్ష పీఠం ద‌క్కుతుంద‌ని ఎంతో ఆశ‌లు పెట్టుకున్నారు. కానీ, ఎందుకో ఆ అదృష్టం ఇప్ప‌ట్లో ద‌క్కేలా క‌నిపించ‌డంలేదు. దీంతో ఆయ‌న ఇటీవ‌ల కొన్నాళ్లుగా మీడియాకు దూరం అయిపోయారు.

అయితే, అనూహ్యంగా శ‌నివారం మీడియా ముందుకు వ‌చ్చిన సోము.. ఈ సారి త‌న మాట‌ల తూటాల‌ను అసంద‌ర్భంగా న‌క్స‌ల్స్ వైపు మ‌ళ్లించారు. న‌క్స‌ల్‌ని ప‌రోక్షంగా ఏకిపారేయ‌డంతోపాటు అవినీతి ప‌రులైన న‌లుగురు ఎమ్మెల్యేల‌ను కాల్చి పారేయండ‌ని పిలుపునివ్వ‌డం ఇప్పుడు సంచ‌ల‌నం సృష్టిస్తోంది. పేదలను, సామాన్యులను చంపడానికా నక్సల్స్ ఉన్నది అని తీవ్ర‌స్తాయిలో ప్రశ్నించారు. అవినీతిని అంతం చేయడానికే పుట్టుకొచ్చామని చెప్పే నక్సల్స్.. దమ్ముంటే నలుగురైదుగురు అవినీతి ఎమ్మెల్యేలను కాల్చిచంపాలని ఆయన డిమాండ్ చేశారు.

అవినీతి అడవుల్లో లేదని, ప్రజల మధ్య ఉందని చెప్పిన ఆయ‌న .. నక్సల్స్ అందరూ అడవులను వీడి జనాల మధ్యకు రావాలని కోరారు. ఏదో పోనీలే ఇంత వ‌ర‌కు బాగానే ఉంద‌ని అనుకుంటే.. సోము ఈసారి న‌క్స‌ల్స్‌నే టార్గెట్ చేశారు. కొంతమంది నక్సలైట్లు బెదిరింపుల ద్వారా వచ్చిన డబ్బులను అడవుల్లోని డంపుల్లో దాస్తున్నారని రెచ్చిపోయారు. ఓ ర‌కంగా ఇటీవ‌ల కాలంలో ఏ ఒక్క నేతా కూడా ఇలా రెచ్చిపోయిన సంద‌ర్భంలేదు. కానీ ఎందుకో టైం కాని టైంలో సోము రెచ్చిపోవ‌డం అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. మ‌రి దీనికి రియాక్ష‌న్‌గా ఎటు వైపు నుంచి ఎలాంటి కామెంట్లు దూసుకువ‌స్తాయో చూడాలి.