సీఎం సీటంటే.. ఎవరికి చేదు చెప్పండి? పొలిటికల్ నేతలు ఎన్ని కష్టాలు పడినా.. ఆ సీటు కోసమేకదా?! అలాంటి హాట్ సీటు కోసం తమిళనాడులో దివంగత సీఎం జయలలితకు నెచ్చెలిగా ఉన్న శశికళా నటరాజన్ ఎంతకు తెగించిందో తెలిస్తే.. ముక్కున వేలేసుకోవాల్సిందే. జయకు సన్నిహితురాలిగా, పోయెస్ గార్డెన్కి కాపలాదారుగా వ్యవహరించిన శశికళపై ఇప్పుడు అనేక కథనాలు వెలుగు చూస్తున్నాయి. అమ్మతో స్నేహం వెనుక.. శశికళ ఆమె కుటుంబం పెద్ద ప్లాన్తోనే ఉన్నారని ఆ కథనాలు వెల్లడిస్తున్నాయి.
సెప్టెంబరు 21న తీవ్ర అనారోగ్యంతో అపోలో ఆస్పత్రిలో చేరిన తర్వాత కొన్నాళ్లకే జయ ఆరోగ్యంపై అనేక వదంతులు వెల్లువెత్తాయి. అమ్మ చనిపోయిందంటూ.. ఫేస్బుక్లో పోస్టులు కూడా వచ్చేశాయి. అయితే, వైద్యులు ఇవన్నీ ఖండించారు. ఇక, ఈ సమయంలో అమ్మకు సాయంగా ఆస్పత్రిలోనే ఉన్న శశికళ.. ఇల్లు చక్కదిద్దుకునే కార్యక్రమానికి ఆస్పత్రిలోనే శ్రీకారం చుట్టిందట. అమ్మ తర్వాత ఇక, అన్నీ తానేనని, పార్టీని, రాష్ట్రాన్ని పాలించేదీ తానేనని పేర్కొంటూ.. తనకు నమ్మకంగా ఉన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలతో తెల్లకాగితాలపై సంతకాలు సైతం తీసుకుందట.
అంటే, వీరంతా అమ్మ తర్వాత శశికళే.. సీఎం అని అంగీకరించినట్టుగా పేర్కొంటూ ఆ పత్రాలపై సంతకాలు చేశారన్న మాట. అయితే, మెజారిటీ ఎమ్మెల్యేలు మాత్రం దీనికి వ్యతిరేకించడంతో శశికళ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. అదేవిధంగా అమ్మ ఆరోగ్యంతో ఉండగా.. పోయెస్ గార్డెన్ చుట్టుపక్కలకు సైతం వచ్చేందుకు సాహసం చేయని శశికళ భర్త నటరాజన్.. అమ్మ చనిపోయిన తర్వాత.. ఆమె మృతదేహం పక్కనే ఉండడాన్ని బట్టి.. పోయెస్ గార్డెన్ సహా పార్టీలో పెత్తనం ఎవరిదనేది పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు.
మొత్తానికి ఈ పరిణామాలను దగ్గరగా చూస్తే.. అమ్మ.. అమ్మ.. అంటూ జయకు నెచ్చెలిగా పేరొందిన శశికళ.. ఇప్పుడు అమ్మ తర్వాత సీఎం అయిపోవాలని అనుకోవడం స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికిప్పుడు కేంద్రంలోని బీజేపీ జోక్యం చేసుకుని అమ్మ నమ్మిన బంటు పన్నీర్ను సీఎం చేయడంతో శశికళ.. సైడ్ అయినా.. రాబోయే రోజుల్లో.. అంటే మరో ఆరు నెలల్లో జయ నియోజకవర్గం ఆర్కే నగర్ నుంచి శశికళ పోటీ చేసి.. మంత్రి వర్గంపై పూర్తిగా పట్టు సాధించడం, రాబోయే రెండేళ్లలో అధికారం మొత్తం ఆమె హస్తగతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.