రేవంత్‌పై త‌మ్ముళ్ల గ‌రంగ‌రం

పాలిటిక్స్ అన్నాక శ‌త్రువులు విప‌క్షంలోనే ఉండ‌న‌క్క‌ర‌లేదు! సొంతపార్టీలోనూ శ‌త్రువులు ఉండొచ్చు. అస‌లామాట కొస్తే.. ఉంటారు కూడా! ఇప్పుడు ఈ మాట‌లు ఎందుకంటే.. తెలంగాణ టీడీపీలో ఓ రేంజ్‌లో దూసుకుపోతున్న కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డికి సొంత పార్టీ టీడీపీ లోనే శ‌త్రువులు ఎక్కువ‌య్యార‌ట‌! ఇప్పుడు అంద‌రూ దీనిపైనే చ‌ర్చించుకుంటున్నారు. ఒక ప‌క్క పార్టీ అధినేత చంద్ర‌బాబు.. అంద‌రూ క‌ల‌సిక‌ట్టుగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని, క‌ల‌సి ముందుకు సాగాల‌ని పిలుపునిస్తున్నారు.

అయితే, అధినేత ఆశ‌ల‌కు విరుద్ధంగా తెలంగాణ టీడీపీలో కార్య‌క్ర‌మాల‌కు తెర‌తీస్తున్నారు. ఇంత‌కీ రేవంత్‌పై ఎందుకు కొంద‌రు టీడీపీ నేత‌లు ఫైరైపోతున్నారంటే.. దీనికి కార‌ణంగా ఆయ‌న ఎవ‌రినీ లెక్క‌చేయ‌డం లేద‌ట‌. వాస్త‌వానికి రాష్ట్రంలో బల‌మైన రెండో ప్ర‌తిప‌క్షంగా ఉన్న టీడీపీ.. కేసీఆర్ ఆక‌ర్స్ దెబ్బ‌కి తీవ్రంగా కేడ‌ర్‌ని కోల్పోయింది. దీంతో కేసీఆర్‌పై పోరాటానికి పెద్ద సాహ‌స‌మే చేయాల్సి వ‌స్తోంది. కానీ, రేవంత్ మాత్రం.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ విష‌యంలో కానీ, రైతుల ఆత్మ‌హ‌త్య‌ల విష‌యంలోకానీ ప్ర‌భుత్వంపై యుద్ధం చేశారు.

ఇప్పుడు తాజాగా విద్యార్థుల‌కు మ‌ద్ద‌తుగా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వంపై పోరాటానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో తాజాగా విద్యార్థి పోరు కార్య‌క్ర‌మం త‌ల‌పెట్టారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌తోపాటు, ఫీజు రీఎంబ‌ర్స్‌మెంట్‌, ఇంజినీరింగ్ క‌ళాశాల‌ల మూసివేత వంటి స‌మ‌స్య‌ల‌పై రేవంత్ ఉద్య‌మానికి రెడీ అయ్యాడు. అయితే, దీనిపైనే టీడీపీ నేత‌లు గుస్సాఅవుతున్నారు.

త‌మ‌కు చెప్ప‌కుండానే, త‌మ‌ను క‌లుపుకోకుండానే ఇలాంటి కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. దీంతో రేవంత్‌పై టీడీపీ నేత‌లు గ‌రంగ‌రంగా ఉన్నారు. మ‌రి దీనికి రేవంత్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. మ‌రో ప‌క్క ఈ విష‌యం అధినేత చంద్ర‌బాబుకి తెలిస్తే ఏమ‌వుతుందో చూడాలి. ఏదేమైనా రేవంత్ దూకుడుకు సొంత పార్టీలోనే శ‌త్రువులు ఎక్కువ‌వుతున్నార‌న్న చ‌ర్చ‌లు టీ పాలిటిక్స్‌లో వినిపిస్తున్నాయి.