ఈ సారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇద్దరు అగ్ర హీరోలు పందెం కోళ్లలా తమ కేరీర్లో ల్యాండ్ మార్క్ సినిమాలతో తలపడేందుకు రెడీ అవుతున్నారు. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150, బాలయ్య 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి రెండూ సంక్రాంతి బరిలో దూకనున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలపై ఏపీ, తెలంగాణ ఏ రేంజ్లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.
సినిమాలపై అంచనాలకు తగ్గట్టుగానే ఏపీ, తెలంగాణలో భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. ఏపీ, తెలంగాణ వరకు ఈ రెండు సినిమాపై మంచి అంచనాలే ఉన్నా ఓవర్సీస్లో మాత్రం ఈ సినిమాలకు అనుకున్న స్థాయిలో క్రేజ్ రావడం లేదన్న టాక్ ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది.
ఈ రెండు సినిమాల నిర్మాతలకు ఓవర్సీస్ రైట్స్ అమ్మకాల నుంచే చుక్కలు కనిపిస్తున్నాయి. ముందుగా చిరు ఖైదీ నెం 150 ఓవర్సీస్ రైట్స్ను రూ 13.5 కోట్లకు భేరం పెట్టారు. ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థ వారు అగ్రిమెంట్ చేసుకుని చివరి క్షణంలో హ్యాండ్ ఇచ్చారు. దీంతో చెర్రీ ఆ రైట్స్ను మెగా ఫ్యామిలీకి దగ్గరగా ఉండే మరో నిర్మాత కం డిస్ట్రిబ్యూటర్కు రూ.10 కోట్లకే ఇచ్చేశాడట. మాట కాదనలేక కొన్నాడు కానీ ఇపుడు ఆ 10 కోట్లు రాబట్టాలంటే ఈ వసూళ్లు అక్కడ 2 మిలియన్లు రాబట్టాల్సి ఉంది.
ఇక బాలయ్య శాతకర్ణిని బాలయ్య కేరీర్లోనే ఓవర్సీస్లో ఏ సినిమాకు అమ్మని రేటుకు అమ్మారు. శాతకర్ణి చిత్రాన్ని 4 కోట్ల రూపాయలకు ఓవర్సీస్ లో విక్రయించారు. ఈ మొత్తానికి బ్రేక్ ఈవెన్ రావాలన్నా కనీసం 0.9 నుంచి 1 మిలియన్ డాలర్లు వసూలు చేయాలి.
బాలయ్య కేరీర్లో ల్యాండ్ మార్క్ మూవీ, క్రిష్ డైరెక్షన్, హిస్టారికల్ మూవీ కావడంతో ఈ రేటు అయినా పలికింది అంటున్నారు. కానీ మొన్న విడుదల చేసిన ట్రైలర్ చూసిన తరువాత 1 మిలియన్ మార్కును అందుకోవటం పెద్ద కష్టం కాదు, అలాగే 2 మిలియన్ మార్కుని తాకినా పెద్ద ఆశ్చర్య పోవక్కరలేదు అని సినీ పండితులు విశ్లేషిస్తున్నారు. మరి ఓవర్సీస్లో ఈ రెండు సినిమాలు అక్కడి ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి.