అవును! ఏపీలోని హిందూపురం ఎమ్మెల్యే, టీడీపీ అధినేత చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య ఇప్పుడు పూర్తిస్థాయిలో తెలంగాణను టార్గెట్ చేశాడు. దీనివెనుక పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా? మూవీ రీజన్స్ ఉన్నాయా? ఇప్పడే తెలియకపోయినా.. బాలయ్య స్టెప్స్ చూస్తే.. ఏదో దూరాలచనతోనే అడుగులు వేస్తున్నట్టు భావించాలి. ఇక, విషయంలోకి వస్తే.. బాలయ్య ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 100 వ చిత్రం గౌతమీ పుత్రశాతకర్ణి. సంచలన డైరెక్టర్ క్రిష్ డైరెక్షన్లో ఇస్తున్న మూవీపై అంచనాలు బాగానే ఉన్నాయి.
ఇక, దీనిని బాలయ్య చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. దీనిలో శ్రేయ కథానాయకిగా నటిస్తోంది. ఇక, ఈ మూవీ టీజర్కి కూడా భారీ ఎత్తున లైకులు పడ్డాయి. దీంతో బాలయ్య రేంజ్ మరింత ఎత్తుకు ఎగబాకింది. 2017 సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ఆడియో రిలీజ్ పంక్షన్ని తిరుపతిలో ఏర్పాటు చేయాలని బాలయ్య సహా చిత్రం యూనిట్ ప్లాన్ చేసింది. అదిరిపోయే సెట్టింగులతో ఏర్పాట్లు కూడా ప్రారంభించారు. అయితే, కారణం తెలియదుకానీ వాయిదా పడింది.
ఇంతలో తెలంగాణలోని పోరుగడ్డ కరీంనగర్ వేదికగా మూవీ ట్రైలర్ను డిసెంబరు 16న విడుదల చేయాలని బాలయ్య సన్నాహాలు కూడా ప్రారంభించాడు. వాస్తవానికి బాలయ్య మూవీలన్నీ విజయవాడ, విశాఖ, తిరుపతి వేదికలుగానే గతంలో పలు ఫంక్షన్లను జరుపుకొన్నాయి. వీటికి భిన్నంగా తెలంగాణలో బాలయ్య ఈ ఫంక్షన్ ఏర్పాటు చేయడం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఇలా బాలయ్య ప్లాన్ చేయడం వెనుక ఏదైనా విషయం ఉందా? అని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి ఈ మూవీ చారిత్రక కథనం ఆధారంగా నిర్మించిన నేపథ్యంలో తెలంగాణ లో దీనికి వినోదపన్ను మినహాయింపు కోరాలని బాలయ్య భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన తెలంగాణలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఏం జరుగుతుందో చూడాలి.