తెలంగాణ పాలిటిక్స్లో సరికొత్త ముఖచిత్రం ఆవిష్కృతమయ్యేందుకు రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు శత్రువులుగా కత్తులు దూసుకున్న పార్టీలు రేపటి నుంచి మిత్రులు కాబోతున్నారు. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వంలో చేరేందుకు ప్రాథమిక చర్చలు జరిగినట్టు టీ పాలిటిక్స్లో వార్తలు వినిపిస్తున్నాయి.
కేంద్రంలోని ఎన్డీయే సర్కార్లో టీఆర్ఎస్ చేరితే తెలంగాణలోని టీఆర్ఎస్ సర్కార్లో బీజేపీ చేరనుందట. ఏపీలో అధికారంలో ఉన్న బీజేపీ-టీడీపీ సర్కార్ అవలంభిస్తోన్న సేమ్ టు సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా అమలుకానుంది. టీఆర్ఎస్కు కేంద్రంలో రెండు మంత్రి పదవులు ఇచ్చేందుకు మోడీ ఓకే చెప్పినట్టు సమాచారం.
వచ్చే యేడాది ఆరంభంలో ముందుగా తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ ఉండేలా కనిపిస్తోంది. ఈ విస్తరణలో బీజేపీకి కేసీఆర్ కేబినెట్లో రెండు బెర్త్లు ఖాయంగా దక్కనున్నాయి. ఇక కేంద్రంలో టీఆర్ఎస్ నుంచి మంత్రి పదవుల రేసులో ఉన్న వారిలో ఎంపీలు వినోద్కుమార్, జితేందర్రెడ్డి, కవిత ఉన్నారు. వీరిలో జితేందర్రెడ్డి, వినోద్కుమార్కే మొగ్గు ఉన్నా కవితకు ఛాన్స్ వస్తే వినోద్కు మొండి చేయి తప్పదు.
ఇక కేసీఆర్ కేబినెట్లో బీజేపీ నుంచి మంత్రి పదవుల కోసం నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్తో పాటు ఎమ్మెల్సీ రాంచంద్రరావు పోటీ పడుతున్నారు. వీరిలో ఏ ఇద్దరికి అయినా బెర్త్ దక్కే ఛాన్సులు ఉన్నాయి.