ఏపీ మంత్రి ఉమా.. వ‌దిన‌ను చంపారా..!

ఆరోప‌ణ‌లు హ‌ద్దు మీరితే ఎలా ఉంటుంది? రాజ‌కీయ విమ‌ర్శ‌లు క‌ట్టుదాటితే ఎంత దూరం వెళ్తాయి? అంటే.. ఇప్పుడు వైకాపా అధికార ప్ర‌తినిధి హోదాలో వాసిరెడ్డి ప‌ద్మ గుప్పించిన విమ‌ర్శ‌ల మాదిరిగానే ఉంటాయి!! ఆశ్చ‌ర్యంగా అనిపించినా నిజ‌మేన‌నే టాక్ వ‌స్తోంది. విష‌యంలోకి వెళ్తే.. ఏపీ అధికార ప‌క్షం టీడీపీ, విప‌క్షం వైకాపాల మ‌ధ్య విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు మామూలే. ఈ క్ర‌మంలోనే ఏపీ మంత్రి దేవినేని ఉమా వైకాపా అధినేత జ‌గ‌న్‌పై విరుచుకుప‌డ్డారు. దీనికి కౌంట‌ర్‌గా విమ‌ర్శ‌లు ప్రారంభించిన ప‌ద్మ‌.. మంత్రిపై ఏకంగా ప‌ర్స‌న‌ల్ ఎటాక్ చేసేశారు.

అంతేకాదు.. రెండు చెంప‌లు వాయిస్తాన‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డం సంచ‌ల‌నం సృష్టించింది. గతంలో ఎక్క‌డికో వెళ్లిపోయిన ప‌ద్మ‌.. చంద్ర‌బాబు ఉమ్మ‌డి రాష్ట్రంలో అధికారంలో ఉండ‌గా.. దేవినేని వెంక‌ట‌ర‌మ‌ణ(అంటే.. దేవినేని ఉమా అన్న‌) మంత్రిగా ఉన్నారు. అయితే, ఆయ‌న అప్ప‌ట్లో జ‌రిగిన న‌ర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్ర‌మాదం మృతి చెందారు. ఈ వార్త‌ను త‌ట్టుకోలేని ఆయ‌న భార్య దేవినేని ప్ర‌ణీత కూడా అప్ప‌ట్లో.. మంత్రి మృతి చెందిన రెండో రోజే.. ఆత్మహ‌త్య‌కు పాల్ప‌డి ప్రాణాలు తీసుకున్నారు. ఈ విష‌యం అప్ప‌ట్లో పెద్ద ఎత్తున రాష్ట్రంలో సంచ‌ల‌నం సృష్టించింది.

ఇప్పుడు ఇదే విష‌యంపై ప‌ద్మ పెద్ద ఎత్తున మంత్రిపై ఆరోప‌ణ‌లు చేశారు. రాజ‌కీయ వార‌స‌త్వం కోసం .. ఉమానే వ‌దిన‌ను చంపార‌ని ఆమె అన్నారు. వ‌దిన బ‌తికి ఉంటే త‌న‌కు రాజ‌కీయంగా ఎలాంటి ప్రాధాన్యం ఉండ‌ద‌ని భావించే ఉమా.. వ‌దిన ప్రాణాలు తీశార‌ని ఆరోపించారు. చంద్ర‌బాబు మామ‌కు వెన్నుపోటు పొడిస్తే.. ఉమా వ‌దిన ప్రాణాల‌కే ముప్పు తెచ్చి.. రాజ‌కీయాల్లోకి వ‌చ్చార‌ని అన్నారు. అలాంటి ఉమా.. జ‌గ‌న్‌ను విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని చెప్పుకొచ్చారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు పొలిటిక‌ల్‌గా తీవ్ర సంచ‌ల‌నం సృష్టించాయి. పొలిటిక‌ల్ విమ‌ర్శ‌లు హ‌ద్దు మీరితే ఎలా ఉంటుందో ఇది ఉదాహ‌ర‌ణ అని పొలిటిక‌ల్ పండితులు అంటున్నారు.