ఏపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ తెలంగాణ ఎమ్మెల్యే

జేసీ బ్ర‌ద‌ర్స్‌.. సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌! వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేస్తూ ఎప్పుడూ వార్త‌ల్లో నిలిచే వ్య‌క్తులు! ఏ పార్టీలో ఉన్నా, ఎంత‌టివారైనా డోంట్ కేర్‌!! జ‌గ‌న్ రెడ్డి కాద‌ని ఎంపీ జేసీ దివాక‌ర్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తే.. ఇప్పుడు తాడిప‌త్త్రి ఎమ్మెల్యే జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తెలంగాణ‌కు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేతో సై అంటే సై అంటున్నారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై మొద‌లైన ఈ ర‌గ‌డ‌.. స‌వాళ్లు ప్ర‌తిస‌వాళ్ల వ‌ర‌కూ వెళ్లింది. దీంతో జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేయ‌డంతో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి.

ఆర్టీని బ‌లోపేతం చేసేందుకు టీఆర్ఎస్ స‌ర్కార్ అనేక ప్ర‌ణాళిక‌లు చేప‌డుతోంద‌ని అయితే ఏపీకి చెందిన ట్రావెల్స్ ఇష్టానుసారంగా, అనుమ‌తులు లేకుండా వ్య‌వ‌హ‌రిస్తున్నాయ‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. ఈ విష‌యంపై ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ స‌మావేశాల్లో ఆయ‌న ప్ర‌స్తావించారు. అయితే దీనిపై జేసీ ప్ర‌భాక‌ర్ రెడ్డి తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తంచేశారు. అన్ని అనుమతులతోనే ట్రావెల్ నిర్వహిస్తున్నామ‌ని వివ‌రించారు. రండి చర్చించుకుందాం అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసిరారు. ఈ విషయమై తేల్చుకోడానికి ఆయన మంగళవారం ఉదయం శ్రీనివాసగౌడ్ అనుచరులతో కలిసి ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీసుకు వచ్చారు. త‌ర్వాత ప్రభాకర్ రెడ్డి చేరుకున్నారు.

ఒక్క‌సారిగా అక్క‌డ ఉద్రిక్త ప‌రిస్థితులు తలెత్తే అవ‌కాశం ఉండ‌టంతో పోలీసులు ఆయ‌న్ను అరెస్టు చేశారు.అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాసగౌడ్ ఆరోపించగా, తమవద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. పాలెం బస్సు దుర్ఘటనలో కూడా ఆయనదే నేరమని శ్రీనివాసగౌడ్ ఆరోపించారు. తాము తప్పు చేస్తే తమ బస్సులు సీజ్ చేయాలని జేసీ అన్నారు.

తనమీద ఆయన చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపిస్తే వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తామని కూడా శ్రీనివాస గౌడ్ అన్నారు. తాము దివాకర్ ట్రావెల్స్ విషయాన్ని కూడా ప్రస్తావించలేదని, పలు ట్రావెల్స్ గురించి మాట్లాడితే ఈయనొక్కరే స్పందించారని అన్నారు. ఏదేమైనా ఏపీ ఎమ్మెల్యే వ‌ర్సెస్ తెలంగాణ ఎమ్మెల్యే మ‌ధ్య ఫైట్ ఒక్క‌సారిగా కాస్త హాట్ టాపిక్‌గా మారింది.