కేసీఆర్ ఫీల్ గుడ్ స్టోరీ

తెలంగాణ సీఎం కేసీఆర్‌.. ఇప్పుడు బ‌స్సు యాత్ర‌కు సిద్ధం అవుతున్నారు. ప్ర‌భుత్వానికి, పార్టీకి మ‌రింత జోష్ పెంచేందుకు ఆయ‌న రెడీ అయ్యారు. అధికారంలోకి వ‌చ్చి రెండున్న‌రేళ్లు పూర్త‌వుతుండ‌డం, ప‌థ‌కాలు, ప్రాజెక్టులు వంటివి పెద్ద ఎత్తున అమ‌లు చేస్తుండ‌డంతో ఆయ‌న ఆయా విష‌యాల‌ను ప్ర‌జ‌ల్లోకి బ‌లంగా తీసుకువెళ్లాల‌ని ఆయ‌న నిర్ణ‌యించారు. మ‌రోప‌క్క‌, కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న యాంటీ ప్ర‌చారం కేసీఆర్‌కు పెద్ద ఎత్తున విసుగు తెప్పిస్తోంది. ప‌థ‌కాలు న‌త్త‌డ‌క‌న సాగుతున్నాయ‌ని, ఆరోగ్య శ్రీవంటివి కుంటుప‌డుతున్నాయ‌ని కాంగ్రెస్ నేత‌లు ఆరోపిస్తున్నారు.

ఈ క్ర‌మంలో కేసీఆర్‌.. ఇటీవ‌ల మంత్రులకు ఆయ‌న క్లాస్ ఇచ్చారు. ప్ర‌భుత్వం ఎంతో చేస్తున్నా.. విప‌క్షాల విమ‌ర్శ‌లు పెద్ద ఎత్తున సాగుతున్నాయ‌ని, దీనిని అడ్డుకోవాల్సిన బాధ్య‌త ప్ర‌తి ఒక్క‌రిపైనా ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు ఆయ‌న బ‌స్సు యాత్ర‌కు సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రో ముఖ్య విష‌యం ఏంటంటే వివిధ స‌ర్వేల్లో బెస్ట్ సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించారు. దీనికితోడు ప్ర‌జ‌ల్లో ఆయ‌న‌కు మంచి ఆద‌ర‌ణ ఉంద‌ని కూడా ఆ స‌ర్వేల్లో స్ప‌ష్ట‌మైంది.

దీంతో ఇప్పుడే, ఈ స‌మ‌యంలోనే ప్ర‌జ‌ల్లోకి వెళ్ల‌డం వ‌ల్ల మంచి మార్కులు కొట్టేయొచ్చ‌నేది కూడా కేసీఆర్ వ్యూహాల్లో భాగంగా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో 2019 ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని ఆయ‌న బ‌స్సు యాత్ర‌ల‌కు శ్రీకారం చుట్టార‌ని స‌మాచారం. ఇక‌, వ‌చ్చే నెల 2 సికింద్రాబాద్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌కు కూడా ఆయ‌న ప్లాన్ చేశారు. మొత్తానికి తెలంగాణ‌లో కేసీఆర్ మ‌రింత పుంజుకునేందుకే వీటిని ప్లాన్ చేసిన‌ట్టు తెలుస్తోంది.