ఏపీ ఏకైక విపక్షం వైకాపాలో సినీ గ్లామర్ పెరుగుతోంది. మాజీ హీరోయిన్ రాశి త్వరలోనే జగన్ గూటికి చేరేందుకు అన్ని ప్రయత్నాలూ పూర్తయ్యాయని తెలుస్తోంది. ఇక, ముహూర్తమే తరువాయి అన్నట్టు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి చంద్రబాబు పార్టీ టీడీపీతో పోల్చుకుంటే వైకాపాకి సినీ గ్లామర్ చాలా తక్కువ. ఒక్క రోజా తప్ప ఆపార్టీలో సినీ గ్లామర్ ఉన్న వాళ్లు లేరు. గతంలో ఎప్పుడో జీవిత, రాజశేఖర్ జగన్ పంచన ఉన్నా. అది ముగిసిన ముచ్చట. ఇప్పటికైతే.. రోజా ఒక్కరే వైకాపాలో యాక్టివ్ సినీ గ్లామరస్గా షైన్ అయిపోతున్నారు.
ఇక, టీడీపీ విషయానికి వస్తే.. నటతేజం బాలయ్య సహా రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ తదితరులు ఉన్నారు. దీంతో వైకాపాకి సినీ గ్లామర్ తగ్గిందనే భావించాలి. ఈ క్రమంలోనే వైకాపాలో సినీ గ్లామర్ని పెంచాలని జగన్ భావించారు. దీంతో మాజీ సుందరి రాశిని లైన్లో పెట్టినట్టు సమాచారం. ఇటీవల ఈమె లోటస్ పాండ్లోని జగన్ నివాసానికి తన కుమార్తెతోపాటు వచ్చింది. దీంతో అందరూ రాశి వైకాపా తీర్థం పుచ్చుకోవడం ఖాయమని అనుకున్నారు. దీనిపై ఆమె మాట్లడుతూ.. తన కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా జగన్ ఆశీస్సుల కోసమే తాను జగన్ కార్యాలయానికి వచ్చానని చెప్పింది.
అంతకు మించి ప్రత్యేక త ఏమీ లేదని అందరూ చెప్పినట్టే ఓ మాట అనేసింది. కానీ, ప్రస్తుతం రోజా మాత్రమే ఉన్న నేపథ్యంలో వైకాపాకి సినీ కలర్ పెంచాలనే ఉద్దేశంతో జగన్ రాశిని ఆహ్వానించినట్టు సమాచారం. త్వరలోనే ఆమె వైకాపాలో చేరతారని తెలుస్తోంది. మరోపక్క, దర్శక రత్న దాసరి కూడా వైకాపాలోకి చేరే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. దీంతో రోజా, రాశి.. మధ్యలో దాసరి.. వైకాపా మూవీ హిట్టే అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో 2019 వరకు వేచి చూడాలి.