టాలీవుడ్లో మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్ గా పేరున్న దర్శకుడు బోయపాటి శ్రీను. టాలీవుడ్లో స్టార్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు మాస్ హీరోలుగా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ కావాలన్నా.. ఊరమాస్ ఇమేజ్ కావాలన్నా వారికి బోయపాటి బెస్ట్ ఆప్షన్గా కనిపిస్తున్నాడు.
బాలయ్యతో సింహా, లెజెండ్ లాంటి బ్లాక్బస్టర్ హిట్లు తెరకెక్కించిన బోయపాటి ఈ యేడాది స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన సరైనోడు సినిమాతో కేరీర్లోనే తిరుగులేని బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక సరైనోడు తర్వాత బోయపాటి బెల్లంకొండ శ్రీనివాస్తో ఓ సినిమాను డైరెక్ట్ చేస్తాడని వార్తలు వచ్చాయి.
వాస్తవానికి ఈ సినిమా సరైనోడు సినిమా కంటే ముందే పట్టాలెక్కినా అనివార్య కారణాల వల్ల ఆగిపోయింది. ఈ సినిమాపై ఆసక్తి కరమైన వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. నైజాంలో బడా సినిమాలు పంపిణీ చేసే పంపిణీ సంస్థ అభిషేక్ పిక్చర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. తాజాగా ప్రాజెక్ట్ నుంచి అభిషేక్ పిక్చర్స్ తప్పుకుందన్న వార్త టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
వరుస హిట్లతో ఉన్న బోయపాటి ఈ సినిమాకు భారీ రెమ్యునరేషన్ అడిగాడట. ఈ రెమ్యూనరేషన్ విషయంలో వచ్చిన వివాదమే ఇందుకు కారణం అన్న టాక్ కూడా వినిపిస్తోంది. టాలీవుడ్ స్టార్ రైటర్ కోన వెంకట్ తో కలిసి ఎల్ రవీంద్రారెడ్డి ఈ సినిమా నిర్మాణ బాధ్యతలు తీసుకోనున్నారని తెలుస్తోంది.