ఏపీ సీఎం చంద్రబాబు అవాక్కయ్యే విషయాన్ని వైకాపా నేతలు వెల్లడించారు. అక్కడెక్కడో ఉన్న అమెరికా పౌరులు ఎంజాయ్ మెంట్ కోసం పెళ్లిళ్లు చేసుకుంటారని, వాళ్లకి కుటుంబ సంతోషం ఏమిటో తెలీదని నిన్న వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయంలో తన ఛాంబర్ ప్రారంభం సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు కామెంట్లు కుమ్మరించారు. ఈ సందర్భంగానే ప్రస్తుతం అమెరికా అధ్యక్ష రేసులో పోరాడుతున్న ట్రంప్ గురించి మాట్లాడుతూ.. ఆయనకు ప్రస్తుతం ఉన్న భార్య నాలుగో వ్యక్తి అని అనుకుంటున్నట్టు చెప్పారు.
ఇలాంటి పరిస్థితి ఉంటే సంతోషం ఉండదని, ప్రపంచం మొత్తానికి భారత్ రోల్ మోడల్గా నిలిచిందని, ఇక్కడ కుటుంబ వ్యవస్థ కారణంగానే అందరూ సంతోషంగా ఉండగలుగుతున్నారని అన్నారు. ఎప్పుడూ లేంది చంద్రబాబు ఇలా మాట్లాడడంపై మీడియా ఒకింత ఆశ్చర్యపోయింది. ఇదిలావుంటే, ఈ విషయంలోనూ వైకాపా నేతలు చంద్రబాబుకు కౌంటర్ మీద కౌంటర్ ఇచ్చేశారు. ఓ మీడియా చర్చలో పాల్గొన్న వైకాపా అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ.. బాబు గారి తమ్ముళ్ల బాగోతాన్ని బయట పెట్టారు.
చంద్రబాబు ఎక్కడో ట్రంప్ కు ఉన్న భార్యల గురించి చెబుతున్నారని, కాని ఆయన తన పక్కనే ఉన్న ఇద్దరు టీడీపీ నేతలకు కూడా ఇద్దరు,ముగ్గురు భార్యల సంగతి మర్చిపోయినట్లు ఉన్నారని అన్నారు. దీనికి మద్దతుగా ఇదే చర్చలో పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు కృష్ణారావు కూడా ఔనని ఇది నిజమేనని చెప్పారు. అదికారికంగానో, అనధికారికంగానో టీడీపీలోని ఒకరిద్దరు నేతలకు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉన్నారని చెప్పిన ఆయన.. అయితే, వారి పేర్లు మాత్రం వెల్లడించేందుకు నిరాకరించారు. ఇది లీగల్ విషయమని, మనకెందుకని ఆయన దాట వేశారు. ఏదేమైనా.. చంద్రబాబు కామెంట్లపై వైకాపా ఇచ్చిన వెరైటీ కౌంటర్ బాగుంది కదా!