వైకాపా అధినేత జగన్కు పొలిటికల్ రైవల్ కడప టీడీపీ యువ నేత శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి.. ఎట్టకేలకు తన గడ్డం దీక్షకు మోక్షం లభించడంతో ఆనందంతో ఊగిపోతున్నారు. తన దీక్ష ఫలించినందుకు పార్టీ చేసుకుంటున్నారు. ఇది తన ఒక్కడి విజయం కాదని, మొత్తంగా టీడీపీ విజయంగా ఆయన పేర్కొంటున్నారు. అదేసమయంలో వైఎస్ కు కంచుకోట వంటి పలివెందులలోనూ టీడీపీసైకిల్ రివ్వున సాగాలని, ఆదిశగా తాను మరిన్ని చర్యలు తీసుకుంటానని సతీష్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పులివెందుల రైతుల కళ్లలో ఆనందం చూడాలని డిసైడ్ అయినట్టు చెప్పారు. మరి ఇంతకీ ఆయన దీక్ష ఎందుకు చేపట్టారు? ఏమిటి స్టోరీ? వంటివి తెలుసుకోవాలనుందా? అయితే, ఇది చదివి తీరాలి.
ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఉన్న సతీష్ రెడ్డి.. కడప నుంచి ప్రాతానిధ్యం వహిస్తున్నారు. ఈ జిల్లాలో నీరు లేక రైతులు నానాతిప్పలు పడుతున్నారు. దీంతో ఎట్టిపరిస్థితిలోనూ కృష్ణానీళ్లను ఈ జిల్లాలోనూ పారించి పొలిటికల్గా టీడీపీని తిరుగులేని పార్టీని చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన కర్నూలు జిల్లాలోని అవుకు రిజర్వాయర్ నుంచి కడపలోని గండికోటకు కృష్ణానీళ్లను తెస్తామని, ఈ నీళ్లను ఒక్క గండికోటకే కాకుండా వైకాపా అధినేత జగన్ నియోజకవర్గం పులివెందుల, పైడిపాలెం లోని రైతులకు కూడా అందిస్తామని, తమది రైతు ప్రభుత్వంగా నిరూపిస్తామని ఏడాదిన్నర కిందట సతీష్ సవాలు చేశారు. పులివెందుల, గండికోట, పైడిపాలెం ప్రాంతాలకు నీరు ఇచ్చేవరకు తాను గడ్డం చేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. దీని ప్రకారమే ఆయన గడ్డం దీక్షను ప్రారంభించారు.
అదేసమయంలో ప్రభుత్వంపై కడప జిల్లా నీటి అవసరాలను, అదేసమయంలో పొలిటికల్ మైలేజీ పెంచేందుకు అవసరమైన ప్లాన్ను వివరిస్తూ.. వచ్చారు. ఈ క్రమంలో స్పందించిన సీఎం చంద్రబాబు.. కర్నూలు జిల్లా అవుకు నుంచి నీటిని విడుదల చేసేలా పక్కా ప్లాన్ గీసి అమలు చేయించారు. ఈ క్రమంలో ఆదివారం కడప జి్లా ఇంచార్జ్ మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లాలోని ముఖ్యనేతలతో కలిసి అవుకు గేట్లు ఎత్తి గండికోటకు నీటిని విడుదల చేశారు. గేట్లు ఎత్తగానే క్రిష్ణమ్మ గండికోట వరద కాలువలో పరుగులు తీసింది. సుమారు 700 క్యూసెక్కుల ప్రవాహంతో నీరు గండికోటకు ప్రవహిస్తోంది. సోమవారం రాత్రి గానీ మంగళవారం ఉదయానికి గానీ క్రిష్ణా నీరు గండికోటకు చేరుకుంటుంది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున టీడీపీ సేన హాజరైంది. ఈ సందర్భంగా మాట్లాడిన సతీష్ రెడ్డి.. తన కల నెరవేరిందన్నారు. జగన్ నియోజకవర్గం పులివెందుల రైతులకు కూడా నీరు అందుతుందన్నారు.