‘సుప్రీం’ డైరెక్టర్‌తో ఎన్టీయార్‌.

మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్‌ తేజతో ‘సుప్రీం’ సినిమా చేసి హిట్‌ కొట్టిన అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడని సమాచారమ్‌. ముందుగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఎన్టీయార్‌ హీరోగా దిల్‌ రాజు ఓ సినిమా చేయవలసి ఉంది. అయితే సీన్‌లోకి అనిల్‌ రావిపూడి పేరు వచ్చి చేరింది. సినీ పరిశ్రమలో కాంబినేషన్లు అనూహ్యంగా మారిపోతుంటాయి. ఇంకో వైపున వక్కంతం వంశీ కూడా ఎన్టీయార్‌తో ఓ సినిమా చేయాల్సి ఉంది.

ఇది కూడా దిల్‌ రాజు నిర్మాతగా రావాల్సి ఉన్నా కొన్ని కారణాలతో అది వెనక్కి వెళ్ళింది. కళ్యాణ్‌రామ్‌తో ‘పటాస్‌’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్నాడు అనిల్‌ రావిపూడి. అనిల్‌ చెప్పిన కథ దిల్‌ రాజుకి నచ్చడంతో, ఎన్టీయార్‌కి ఆ కథ చెప్పి ఒప్పించాడని సమాచారమ్‌. అంటే అనిల్‌ రావిపూడితో, దిల్‌ రాజు కాంబినేషన్‌ పట్టాలెక్కడానికే ఎక్కువ అవకాశాలున్నాయంటున్నాయి ఫిల్మ్‌ నగర్‌ వర్గాలు.

ఎన్టీఆర్‌ నటించిన ‘జనతా గ్యారేజ్‌’ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోవడంతో, మాస్‌ అప్పీల్‌ ఉన్న ఒక మంచి స్టోరీతో ఎన్టీఆర్‌ ప్రేక్షకుల ముందుకు రావాలనుకుంటున్నాడట. అందుకు తగ్గ స్టోరీ అనిల్‌ రావిపూడి దగ్గర ఉండడంతో వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు అతి త్వరలోనే వెల్లడి చేయనున్నారు చిత్ర బృందం.