కళ్యాణ్‌రామ్‌తో ఎన్టీయార్‌ నిజమేనా?

పూరి జగన్నాథ్‌కి ఎన్టీయార్‌ అంటే ఎంతో అభిమానం. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘ఆంధ్రావాలా’, ‘టెంపర్‌’ సినిమాలొచ్చాయి. ఇంకో సినిమాకి రంగం కూడా సిద్ధమవుతోంది. అయితే ప్రస్తుతం కళ్యాణ్‌రామ్‌తో ‘ఇజం’ సినిమా చేస్తున్న పూరి జగన్నాథ్‌, ఈ సినిమాలో ఎన్టీయార్‌తో ఓ చిన్న పాత్ర చేయిద్దామని అనుకుంటున్నాడట. అయితే ఆ పాత్ర కథలో ఉంటుందా? లేదంటే ఓ పాటలో గెస్ట్‌ అప్పీయరెన్స్‌కి పరిమితమవుతుందా? అనేది తెలియరావడంలేదు.

‘ఇజం’ సినిమాని పూరి, కళ్యాణ్‌రామ్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్నారు. దాంతో సినిమాకి ఇంకా హైప్‌ తీసుకురావడానికి ఎన్టీయార్‌ ఫ్యాక్టర్‌ వాడుకోవాలని పూరి, కళ్యాణ్‌రామ్‌ అనుకుంటున్నారట. ఎన్టీయార్‌తో తమ మనసులో మాట చెప్పగానే, ఆయన కూడా సానుకూలంగా స్పందించాడని సమాచారమ్‌. అంతా అనుకున్నట్లుగా జరిగితే తెరపై అన్నదమ్ములిద్దర్నీ చూసే అవకాశం నందమూరి అభిమానులకు కలుగుతుంది.

ఇంకో వైపున కళ్యాణ్‌రామ్‌, ఎన్టీయార్‌తో ఓ సినిమా నిర్మించబోతున్నాడు. ఆ చిత్రానికి కళ్యాణ్‌రామ్‌ కేవలం నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. ఆ సినిమాని కూడా పూరి జగన్నాథ్‌ చేతిలోనే పెట్టాలని కళ్యాణ్‌రామ్‌ భావిస్తున్నట్లు సమాచారమ్‌. ‘ఇజం’ సినిమా రిలీజయ్యేలోపే ఈ కొత్త సినిమాకి సంబంధించిన అనౌన్స్‌ రానున్నట్లు తెలియవస్తోంది. ఏదేమైనా కళ్యాణ్‌రామ్‌ ‘ఇజం’లో ఒక్క క్షణం ఎన్టీయార్‌ కనిపించినా, ఆ సినిమాకి హప్‌ ఇప్పుడున్నదానికి పదింతలైపోవడం ఖాయం.