రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా ‘ధృవ’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను దసరాకి విడుదల చేసే ప్రయత్నాల్లో ఉంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ఈ సినిమాను దసరాకి విడుదల చేయడంలో కొంచెం కన్ఫ్యూజన్ నెలకొంది. అయితే దసరా మిస్సయితే ఏంటి పరిస్థితి అనే విషయంపై కూడా రాంచరణ్ అండ్ టీం ఆలోచిస్తున్నట్లు టాక్ వినవచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాని దసరా బరిలోనే ఉంచాలనే పట్టుదలతోనే ఇటు చరణ్, అటు సురేందర్ రెడ్డి కూడా ఉన్నారు. అందుకే పగలూ, రాత్రి ఈ సినిమా కోసం శ్రమిస్తున్నారు.
అలాంటిది ఈ టైంలో ఈ కన్ఫ్యూజన్ న్యూస్ బయటికి రావడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఆ గందరగోళానికి తెరదింపుతూ చిత్ర యూనిట్ ఆక్టోబర్ 7న ‘ధృవ’ విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించింది. రామ్ చరణ్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని చేస్తున్నాడు. ఇంతవరకూ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న చరణ్ తొలిసారిగా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో నటిస్తున్నాడు ఈ సినిమాలో. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. ఈమె పాత్ర కూడా హైలైట్గా డిజైన్ చేశారట. అంతేకాదు ఈ సినిమాలో విలన్గా అరవింద్ స్వామి నటిస్తున్నారు. తెలుగు ప్రేక్షకులకు రొమాంటిక్ అండ్ హ్యాండ్సమ్ హీరోగా సుపరిచితుడు అరవింద్ స్వామి. ఈ సినిమాతో విలన్గా తన నటనలోని డిఫరెంట్ యాంగిల్ని చూపించబోతున్నాడు.