నిత్యామీనన్‌ మారిన మనిషి 

తెలుగు సినీ రంగానికి కొత్తే అయినా, ఫలానా హీరో ఎవరో నాకు తెలియదు అని చెప్పడం అవివేకమవుతుందని తెలుసుకోలేకపోయింది అందాల నటి నిత్యామీనన్‌. ప్రభాస్‌ ఎవరో తనకు తెలియదని చెప్పి వివాదం కొనితెచ్చుకున్న ఈ బ్యూటీ అనతి కాలంలో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. పేరుతోపాటే సినీ పరిశ్రమలో ఎలా వ్యవహరించాలో కూడా నేర్చుకున్నట్లుంది. ఈ బ్యూటీ టాలీవుడ్‌ హీరోలందరితోనూ సన్నిహిత సంబంధాల కోసం తాపత్రయ పడుతున్నదట. ఇంటర్వ్యూల్లో ఏ హీరో గురించి టాపిక్‌ వచ్చినా, ఆ హీరో అంటే తనకెంతో ఇష్టమని చెబుతోంది నిత్యామీనన్‌. హీరో నితిన్‌కి అయితే నిత్యామీనన్‌ లక్కీ మస్కట్‌. అలాగే ఈ బ్యూటీ, అల్లు అర్జున్‌తో ‘సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి’లో నటించి హిట్‌ కొట్టింది.

పెద్ద హీరోలతో చిన్న చిన్న అవకాశాలు దక్కించుకుంటూ చిన్న హీరోలతో పెద్ద పెద్ద అవకాశాలు దక్కించుకుంటూ తెలుగులో నిలదొక్కుకుపోయింది నిత్యామీనన్‌. ఆమె నటనా ప్రతిభ కారణంగా ఆమెకు హైట్‌ మైనస్‌ కావడంలేదు. యంగ్‌ హీరోలే కాదు సీనియర్‌ హీరోలతో అయినా నటించి మెప్పించగలనంటోంది ఈ బ్యూటీ. తనను ఎవరైనా లక్కీ మస్కట్‌ అంటే చాలా ఆనందంగా అనిపిస్తుందని తెలుగు సినీ పరిశ్రమ తనకు ఎనలేని గుర్తింపు తెచ్చిపెట్టిందని చెబుతూ, తెలుగులో ఇంకా తనకు సుదీర్ఘమైన కెరీర్‌ ఉందనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది నిత్యామీనన్‌. నిజమే, నిత్యామీనన్‌ మారిన మనిషి.