మళ్ళీ కలవనున్న క్రిష్ అనుష్క!

‘వేదం’ సినిమాలో క్రిష్‌తో కలిసి పని చేసింది ముద్దుగుమ్మ అనుష్క. మల్టీస్టారర్‌ మూవీగా వచ్చిన ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రానుందట. నిజానికి ‘వేదం’ సినిమా టైంలోనే వీరిద్దరూ కలిసి మరో సినిమా చేయడానికి కమిట్‌ అయ్యారట. కానీ అప్పట్నుంచీ కుదరలేదు. ఇప్పుడు క్రిష్‌ అనుష్క కోసం ఒక ఎక్స్‌లెంట్‌ కథను రెఢీ చేశాడట. ప్రస్తుతం ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ సినిమాతో బిజీగా ఉన్నాడు క్రిష్‌. ‘బాహుబలి ది కన్‌క్లూజన్‌’ సినిమాతో బిజీగా ఉంది అనుష్క. ఈ రెండు సినిమాలు పూర్తయినాక వీరిద్దరి కాంబోలో సినిమా పట్టాల్కెనుందని సమాచారం.

ప్రస్తుతం ‘బాహుబలి’ సినిమాతో పాటు అనుష్క రాఘవేంద్రరావు డైరెక్షన్‌లో నాగార్జునతో కలిసి సినిమా చేస్తోంది. ‘ఓం నమో వేంకటేశాయ’ పేరుతో తెరకెక్కబోతోన్న ఈ సినిమాలో అనుష్క సన్యాసిని పాత్రలో నటిస్తోంది. క్రిష్‌తో చేయబోయే సినిమా ‘అరుంధతి’ సినిమా తరహాలో ఉండబోతోందట. ఆ తరహాలోనే భారీ బడ్జెట్‌ మూవీ అట. అనుష్క ఇదే తరహాలో ‘భాగ్‌మతి’ అనే ద్విభాషా చిత్రంలో కూడా నటిస్తోంది. క్రిష్‌ సినిమా కూడా లేడీ ఓరియెంటెడ్‌ మూవీనే. ఈ ముద్దుగుమ్మకు లేటు వయసులో అన్నీ హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీసే వరుసపెట్టి వస్తున్నాయి. గ్లామర్‌ క్వీన్‌గా ఇంతవరకూ టాలీవుడ్‌ని ఏలిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ మూవీస్‌తో బిజీ అయిపోయింది. హీరోయిన్‌ ప్రాధాన్యత గల సినిమాల్లో నటించడం వల్ల గ్లామరస్‌ పాత్రలకు కొంచెం దూరంగా ఉంది. గ్లామర్‌ ఒలకబోయకపోయినప్పటికీ స్వీటీ బ్యూటీకి ఏ మాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు. దటీజ్‌ అనుష్క.