వైసీపీకి ఎంపీ అభ్య‌ర్థులు కావ‌లెను..?

ఏపీలో 2019 ఎన్నిక‌ల్లో విజ‌య‌మే టార్గెట్‌గా ముందుకు వెళుతోన్న విప‌క్ష వైసీపీ ప‌రిస్థితి మూడు అడుగులు ముందుకు…ఆరు అడుగులు వెన‌క్కు అన్న చందంగా ఉంది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ స‌ల‌హాలు ఫాలో అవుతోన్న జ‌గ‌న్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల వ‌ర‌కు కాన్‌సంట్రేష‌న్ చేస్తోన్నా లోక్‌స‌భ నియోజ‌క‌వర్గాల‌ను లైట్ తీసుకుంటున్న‌ట్టే క‌న‌ప‌డుతోంది. ఏపీలో మొత్తం 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ నుంచి ఎంపీలుగా గెలిచిన నంద్యాల ఎంపీ ఎస్పీవై.రెడ్డి, అర‌కు ఎంపీ కొత్త‌ప‌ల్లి గీత పార్టీకి దూరంగా ఉన్నారు. క‌ర్నూలు ఎంపీ బుట్టా రేణుకు భ‌ర్త సైతం టీడీపీలో చేరారు. ఆమెకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో టిక్కెట్టు డౌటే అంటున్నారు. ఈ మూడు స్థానాల్లో వైసీపీ కొత్త అభ్య‌ర్థుల‌ను వెతుక్కోవాల్సి ఉంది. ఇక గ‌త ఎన్నిక‌ల్లో న‌ర‌సాపురం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వంకా ర‌వీంద్ర‌, గుంటూరు నుంచి పోటీ చేసిన బాల‌శౌరి ఎక్క‌డ ఉన్నారో ఎవ్వ‌రికి తెలియ‌దు. ఇక్క‌డ సరైన ప్ర‌త్యామ్నాయం కూడా వైసీపీకి లేదు.

రాజ‌మండ్రిలో వైసీపీ కొత్త అభ్య‌ర్థిని వెతుక్కోవాల్సి ఉంది. ఇక సిట్టింగుల్లో తిరుపతి ఎంపీ వరప్రసాద్, నెల్లూరు ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డిల‌ను మార్చేయాల‌ని ప్రశాంత్ కిషోర్ చెప్పాడ‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇక్క‌డ స‌రైన అభ్య‌ర్థులు లేరు. విశాఖ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ త‌ల్లి విజ‌య‌మ్మే పోటీ చేశారు. మ‌రి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ వైసీపీకి బ‌ల‌మైన అభ్య‌ర్థి కొర‌త వేధిస్తోంది.

ఏలూరులో తోట చంద్ర‌శేఖ‌ర్‌ను మార్చి కోట‌గిరి శ్రీథ‌ర్‌కు ప‌గ్గాలు ఇచ్చినా ఆయ‌న వీక్ క్యాండెట్ అని పార్టీ వాళ్లే చెపుతున్నారు. అనంత జిల్లాలో హిందూపురంలో వైసీపీ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసిన శ్రీథ‌ర్‌రెడ్డిని అక్క‌డ జనాలు మ‌ర్చిపోయారు. ఇక అనంత‌పురంలో జేసీని ఢీకొట్టే స్థాయి అనంత వెంక‌ట్రామిరెడ్డికి లేద‌ని తేలిపోయింది.

ఏదేమైనా ఏపీలో 25 ఎంపీ సీట్ల‌లో వైసీపీకి ప్ర‌స్తుతానికి 15 స్థానాల్లో కూడా బ‌ల‌మైన అభ్య‌ర్థులు లేని ప‌రిస్థితి. మ‌రి జ‌గ‌న్ ఇప్ప‌టకి అయినా లోక్‌స‌భ సీట్ల‌లో బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌పై కాన్‌సంట్రేష‌న్ చేయ‌క‌పోతే ఆ ప్ర‌భావం అసెంబ్లీ సెగ్మెంట్ల‌పై కూడా ప‌డ‌నుంది.