ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ విజయంలో పశ్చిమగోదావరి జిల్లా పోషించిన పాత్రకు వెలకట్టలేం. ఈ జిల్లాలో ఉన్న అన్ని ఎమ్మెల్యే స్థానాలతో పాటు ఎంపీ స్థానాలన్నింటిలోను టీడీపీ క్లీన్స్వీప్ చేసేసింది. అయితే ఈ జిల్లాలో వరుసగా రెండుసార్లు గెలిచిన వచ్చే ఎన్నికల్లో మూడోసారి గెలిచిన హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్విళ్లూరుతోన్న ఓ సిట్టింగ్ ఎమ్మెల్యేకు చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో షాక్ ఇస్తారన్న వార్తలు వెస్ట్ పాలిటిక్స్లో పెద్ద సంచలనంగా మారాయి.
శశి విద్యాసంస్థలకు చెందిన బూరుగుపల్లి శేషారావుకు 2009లో చంద్రబాబు కొత్తగా ఏర్పడిన నిడదవోలు టిక్కెట్టు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో అనూహ్యంగా గెలుపొందిన ఆయనకు 2014 ఎన్నికల్లో మరోసారి సీటు ఇచ్చారు. శేషారావు నియోజకవర్గంలో అంత పట్టుసాధించకపోయినా జిల్లాలో బలంగా వీచిన టీడీపీ గాలి ఎఫెక్ట్తో ఆయన వరుసగా రెండోసారి కూడా గెలిచారు.
రెండుసార్లు గెలిచిన శేషారావుపై ప్రస్తుతం నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయనపై అవినీతి ఆరోపణలతో పాటు పార్టీకోసం కష్టపడిన వారిని విస్మరించడం, ఆయన వల్ల పార్టీకి ఒరిగిందేమి లేకపోవడం లాంటి అంశాలు ఆయనకు చాలా మైనస్గా మారాయి. చంద్రబాబు చేసిన పలు సర్వేల్లో కూడా ఆయనకు లీస్ట్ ర్యాంకులు రావడంతో పాటు శేషారావు పనితీరు అధ్వానంగా ఉందని చంద్రబాబుకు ఇంటిలిజెన్స్ వర్గాలు ఇచ్చిన నివేదికల్లో ఉన్నట్టు కూడా వార్తలు జిల్లాలో వినవస్తున్నాయి.
ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో శేషారావును పక్కన పెట్టి ఆయన సోదరుడు, మంచి ఇమేజ్ ఉన్న బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణను లైన్లో పెట్టాలన్న నిర్ణయానికి బాబు వచ్చేసినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లోనే ఆయన పశ్చిమగోదావరి జిల్లాపరిషత్ చైర్మన్ తనకు ఇవ్వాలని బాబును అడగగా ఆయన తాను జడ్పీచైర్మన్ను ముళ్లపూడి బాపిరాజుకు ఇస్తానని హామీ ఇచ్చానని, ఫ్యూచర్లో తప్పకుండా న్యాయం చేస్తానని హామీ ఇచ్చినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే వచ్చే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే శేషారావు ప్లేస్లో వేణుగోపాలకృష్ణకు సీటు ఖాయమయ్యే ఛాన్సులే కనిపిస్తున్నాయి. అదే జరిగితే శేషారావు హ్యాట్రిక్ ఆశలపై బాబు నీళ్లు చల్లినట్టే అవుతుంది.