ఏపీలో ఇటీవల ఖాళీ అయిన కర్నూలు జిల్లా నంద్యాల శాసనసభా స్థానం ఉప ఎన్నికకు టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు విశ్వసనీయవర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. టీడీపీ సీనియర్ నేత భూమా నాగిరెడ్డి ఆకస్మిక మృతితో నంద్యాల సీటుకు ఉప ఎన్నిక అనివార్యం కానుంది. అయితే ఇక్కడ నుంచి తాము కూడా బరిలో ఉంటామని వైసీపీ అధినేత జగన్ చెప్పడంతో ఉప ఎన్నిక తప్పేలా లేదు. దీంతో అధికార టీడీపీ వర్సెస్ విపక్ష వైసీపీ మధ్య నంద్యాల ఉప పోరు రసవత్తరంగానే జరగనుంది.
ఇదిలా ఉంటే నంద్యాల సీటుకు టీడీపీ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు ఏపీ టీడీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. సీటు కోసం భూమా ఫ్యామిలీతో పాటు శిల్ప సోదరులు, మాజీ ఎంపీ ఫరూక్ పోటీపడినా చంద్రబాబు మాత్రం భూమా ఫ్యామిలీకే సీటు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. భూమా నాగిరెడ్డి సోదరుడు భూమా వీరశేఖర్రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి పేరును ఫైనల్గా ఫిక్స్ చేశారని టాక్.
ఈ సీటు కోసం భూమా చిన్నకుమార్తె మౌనికారెడ్డి పేరు కూడా పరిశీలనకు వచ్చింది. అయితే ఇప్పటకే భూమా పెద్ద కుమార్తె అఖిలప్రియ మంత్రిగా ఉండడంతో అదే కుటుంబం నుంచి ఫ్యూచర్లో బలమైన అభ్యర్థిగా ఉండేలా బ్రహ్మానందరెడ్డి వైపే చంద్రబాబు మొగ్గుచూపినట్టు తెలుస్తోంది.
బ్రహ్మానందరెడ్డి ఆళ్లగడ్డలో శోభ నాగిరెడ్డి మృతి చెందడంతో అప్పుడే వైసీపీ నుంచి సీటు ఆశించారు. అప్పుడు అఖిలప్రియకు ఇవ్వడంతో ఇప్పుడు కర్నూలు జిల్లాలో భూమా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ దృష్ట్యా బ్రహ్మానందరెడ్డిని బలంగా మార్చాలన్న ప్లాన్తో చంద్రబాబు నంద్యాల బరిలో ఆయన్ను దింపనున్నట్టు తెలుస్తోంది. బ్రహ్మానందరెడ్డి పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డికి స్వయానా అల్లుడు కావడంతో అటు కాటసాని మద్దతు ఎలాగూ ఉంటుంది. ఇటు భూమా ఫ్యామిలీపై ఉన్న సానుభూతి కూడా టీడీపీకి వర్కవుట్ అవుతుంది.