ఏపీలో అధికార టీడీపీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ఈ క్రమంలోనే అటు కేంద్రంలోనూ టీడీపీతోనూ కలిసి నడుస్తోంది. దీంతో ఇటు రాష్ట్రంలో రెండు మంత్రుల స్థానాలు, అటు కేంద్రంలో రెండు స్థానాలు ఈ రెండు పార్టీలూ ఇచ్చి పుచ్చుకున్నాయి. దీంతో ఇరు పక్షాల నడుమ కెమిస్ట్రీ బాగానే కుదిరింది. అయితే, ఈ కెమిస్ట్రీ కొన్ని కొన్ని సమస్యలను సునాయాసంగా పరిష్కరించేందుకు కూడా ఉపయోగించుకుంటున్నారట ఇరు పక్షాల నేతలు. ముఖ్యంగా రాష్ట్రంలో కేంద్రం ఏమీ చేయడం లేదని టీడీపీ నేతలు అంటే.. టీడీపీతో తాము మిత్ర పక్షంగా ఉన్నప్పటికీ తమను గుర్తించడం లేదని బీజేపీ నేతలు అన్నా.. వెంటనే తెరమీదకి వస్తున్న ఇద్దరు నాయుళ్లు.. పరిస్థితులను చక్కదిద్దేస్తున్నారట.
నిజానికి ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ.. నిజమేనని అంటున్నారు విశ్లేషకులు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, బీజేపీలో కీలక నేత, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుల దోస్తీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కేంద్రం గురించి చంద్రబాబు పొగిడినా.. పొడగకపోయినా.. వెంకయ్య మాత్రం చంద్రబాబును మోడీతో ముడిపెట్టి ఎక్కిన వేదిక మీదల్లా పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు.ఈ క్రమంలోనే ఇద్దరూ ఓ ఒప్పందం చేసుకున్నారని అంటున్నారు కొందరు! అదేంటంటే.. ఇరు పక్షాల మధ్య ఎవరైనా విమర్శలు సంధిస్తే.. వెంటనే ఈ ఇద్దరు నేతలు తెరవెనుక చక్రం తిప్పుతున్నారట.
అంటే, కేంద్రం ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తానని మాటతప్పింది. ఈ విషయంలో విపక్షాల తోపాటు ఒకరిద్దరు టీడీపీ నేతలు సైతం గొంతు విప్పారు. ఇది కేంద్రానికి ఇబ్బందికర పరిస్థితి కావడంతో విషయం పై సీరియస్ అయిన వెంకయ్య బాబుకి ఓ ఫోన్ కొట్టగానే ఇవతలి పక్షం సైలెంట్ అయిపోతోందట. అదేవిధంగా బీజీపీ స్థానిక నేతలు ముఖ్యంగా సోము వీర్రాజు లాంటి దూకుడు స్వభావం ఉన్నవాళ్లు.. టీడీపీకి మిత్ర పక్షంగానే ఉన్నా ఎలాంటి ప్రయోజనం లేదని, కేంద్రం ఇస్తున్న నిధులకు చంద్రబాబు లెక్క కూడా చెప్పడం లేదని విమర్శిస్తే.. ఇటు నుంచి బాబు.. సేమ్ టు సేమ్ తరహాలో వెంకయ్యకి ఫోన్ చేస్తున్నాడట. దీంతో అటు నుంచి బీజేపీ నేతల నోటికి తాళం పడేలా ఏవో ఆజ్ఞలు! ఇంకేముంది. ఇరు పక్షాల మధ్య ఇలా దాగుడు మూతల ఆటలు సాగుతున్నాయట. ఎంతైనా ఇద్దరు నాయుళ్ల దాగుడు మూతల మధ్య రాష్ట్ర సమస్యలు మరుగున పడుతున్నాయని విశ్లేషకులు మొరపెడుతున్నారు.