ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కీలకమనే చెప్పాలి..ఇంకా చెప్పాలంటే ఆ పార్టీకి చావో రేవో లాంటిది. అందుకే పార్టీని గెలిపించడం కోసం బాబు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. టిడిపి నేతలు అనుకున్న మేర పనిచేయడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఇంటింటికి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అసలు ఒక జాతీయ నాయకుడు అని చెప్పుకునే బాబు చివరికి ఇంటింటికి తిరిగి ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి వచ్చింది.
ఇప్పటివరకు రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇప్పుడు మేనిఫెస్టోని ఇంటింటికి తిరిగి వివరించనున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తుందో వివరించేందుకు ‘బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమం చేస్తున్నారు. 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. ఇందులో భాగంగా బాబు దాదాపు 35 నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. అటు పార్టీ బూత్స్థాయి కార్యకర్తలు, యూనిట్, క్లస్టర్, నియోజకవర్గ ఇన్చార్జిల వరకు ఒక్కో బూత్లో రోజుకి 10 ఇళ్లకు వెళ్లేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో కనీసం 2 లక్షల మంది ఓటర్లను కలుస్తూ..చివరికి 3 కోట్ల మంది ఓటర్లని కలవడమే టిడిపి టార్గెట్.
ఇక బాబు 35 నియోజకవర్గాలని కవర్ చేయనున్నారు. ఇప్పటివరకు 140 నియోజకవర్గాల్లో బాబు పర్యటించారు. ఇప్పుడు మిగిలిన వాటిని కవర్ చేస్తారు. 3,4 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటిస్తారు. 5 నుంచి 9వ తేదీ వరకు ఉమ్మడి అనంతపురం, కర్నూలు జిల్లాల్లోని రాయదుర్గం, అనంతపురం, బనగానపల్లె, పాణ్యం తదితర నియోజకవర్గాల్లో తిరుగుతారు. ఇలా బాబు మిగిలిన స్థానాలని కవర్ చేస్తూ..టిడిపి మేనిఫెస్టో వివరిస్తారు. మొత్తానికి గెలుపు కోసం బాబు నానా కష్టాలు పడుతున్నారు.