`ఆర్ఆర్ఆర్` వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. `ఎన్టీఆర్ 30` వర్కింగ్ టైటిల్ తో ఎప్పుడో ఈ మూవీని అనౌన్స్ చేశారు. అనేక అడ్డంకులు, వాయిదాల అనంతరం ఎట్టకేలకు నేడు ఈ మూవీ ప్రారంభమైంది. హైదరాబాద్ లో పూజా కార్యక్రమాలతో ఈ మూవీకి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ పూజా కార్యక్రమంలో కొరటాల శివ, తారక్, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, దర్శకుడు రాజమౌళి, ప్రశాంత్ నీల్, ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్, నిర్మాత దిల్ రాజు, కళ్యాణ్ రామ్, సంగీత దర్శకుడు అనిరుధ్ తదితరులు హాజరైయ్యారు. అయితే ఈ సందర్భంగా కొరటాల మాట్లాడుతూ.. `ఎన్టీఆర్ 30` కథ మొత్తం చెప్పేశారు. `జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తో మళ్లీ సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఈ సినిమా కథ.. కోస్టల్ బ్యాక్ డ్రాప్ లో ఉంటుంది. ఈ కథలో మనుషుల కన్నా ఎక్కువ మృగాలు ఉంటారు. ఆ మృగాళ్లకు భయమంటే ఏంటో తెలియదు.
దేవుడంటే.. చావంటే భయం లేదు. కానీ వారందరికీ ఒకే ఒక భయం ఉంటుంది. ఆ భయం(ఎన్టీఆర్ పాత్రను ఉద్దేశిస్తూ..) ఏంటో మీకు తెలుసు. వారిని భయపెట్టడానికి లీడ్ రోల్ ఏ రేంజ్ కి వెళ్తుందో ఊహించలేరు` అంటూ కొరటాల చెప్పుకొచ్చారు. సాగర తీరం ప్రధానంగా సాగే కథ ఇది. మృగాలు వంటి మనుషులను వేటాడే మగాడిగా, చాలా పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ క్యారెక్టర్ ఉంటుందని పరోక్షంగా కొరటాల చెప్పేశారు. అంతేకాదు, ఈ మూవీ తన కెరీర్ లోనే ది బెస్ట్ అవుతుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు. దీంతో `ఎన్టీఆర్ 30` పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా, వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.