అలనాటి స్టార్ హీరోయిన్, వెండితెర సత్యభామ జమున ఇకలేరు అన్న సంగతి తెలిసిందే. నాలుగైదేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె హైదరాబాద్ బంజారాహిల్స్లోని తన స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. జమున మృతిపట్ల సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటించారు.
ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జమున అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రమే మహాప్రస్థానంలో ముగిశాయి. అయితే సినిమాల్లోనే కాకుండా రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన జమున జీవిత చరిత్రను వెండితెరపై చూపించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తాజాగా ఓ టాక్ తెరపైకి వచ్చింది.
జమున బయోపిక్ ను తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లోనూ ఏకకాలంలో నిర్మించడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ ఏర్పాట్లు చేస్తోందట. అయితే ఆ అలనాటి తార బయోపిక్ లో నటించే అద్భుత అవకాశాన్ని టాలీవుడ్ కు చెందిన ఓ స్టార్ బ్యూటీ కొట్టేసినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆమె ఎవరో కాదు తమన్నా. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు సైతం పూర్తి అయినట్లు టాక్. మరి ఇది ఎంత వరకు నిజం అన్నది తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సిందే.