సారథి వర్సెస్ సవిత..పెనుకొండ సీటు తేల్చేది ఎప్పుడు?

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే టీడీపీకి పట్టు ఉన్న జిల్లా అని చెప్పవచ్చు..ఈ జిల్లాలో టీడీపీకి కంచుకోట లాంటి నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. అందులో పెనుకొండ కూడా ఒకటి. ఇక్కడ టీడీపీ మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1994, 1999, 2004, 2009, 2014 ఎన్నికల్లో పెనుకొండలో టీడీపీ సత్తా చాటింది. కానీ గత ఎన్నికల్లో పెనుకొండలో జగన్ గాలిలో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ నుంచి శంకరనారాయణ గెలిచారు.

అయితే మొదట్లో మంత్రిగా పనిచేసిన శంకర నారాయణకు..నిదానంగా వ్యతిరేకత పెరుగుతూ వచ్చింది. మధ్యలో ఆయన మంత్రి పదవి కూడా పోయింది. మంత్రిగా ఉన్నప్పుడే పెనుకొండని అభివృద్ధి చేయలేదని, ఇప్పుడు ఎమ్మెల్యేగా చేస్తున్నది కూడా ఏమి లేదని టీడీపీ శ్రేణులు విమర్శలు చేస్తున్నాయి. ఇక ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యేకు నెగిటివ్ ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకుని బలపడటంలో టీడీపీ నేతలు విఫలమవుతున్నారని తెలుస్తోంది. ఇంచార్జ్ గా పార్థసారథి ఉన్నా సరే. ఆయనకు పోటీగా టీడీపీ నాయకురాలు సవితమ్మ సైతం సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళుతున్నారు. దీంతో పెనుకొండలో వర్గ పోరు నడుస్తోంది.

అటు మాజీ ఎంపీ నిమ్మల కిష్టప్ప సైతం..పెనుకొండలో తనదైన శైలిలో రాజకీయం చేస్తున్నారు. ఈ సీటుని తన వారసుడుకు ఇప్పించుకోవాలని చూస్తున్నారు. అయితే సారథి మాత్రం సీటు తనదే అంటున్నారు. దీంతో పెనుకొండ టీడీపీలో గ్రూపు తగాదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్తితుల్లో సీటుపై క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు ఈ వర్గ పోరుకు బ్రేక్ పడే ఛాన్స్ ఉంది. త్వరగా చంద్రబాబు పెనుకొండ సీటులో పోటీ చేసే అభ్యర్ధిని ఫిక్స్ చేస్తే..కాస్త పోరు తగ్గుతుంది. లేదంటే ఈ పోరు వల్ల టీడీపీకి నష్టం జరిగే ఛాన్స్ ఉంది.